ఒకప్పుడు కష్టాలకోర్చి పంటలు పండించిన రైతుకు నేనున్నానంటూ ఆసరా అయింది కేసీఆర్ సర్కారు. అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తూ వచ్చిన దిగుబడిని వడ్డీలకు కడుతూ అలసిపోయిన అన్నదాతకు ‘రైతుబంధు’తో కొండంత భరోసానిస్తోంది. దీంతో ఇన్నాళ్లూ భారంగా సాగిన రైతన్న.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా రెండు సీజన్లలో పెట్టుబడి సాయం ఇస్తుండడంతో సంతోషంగా సాగు చేసుకుంటున్నాడు. ఎక్కడా చేయిచాపకుండా ప్రభుత్వం బ్యాంకులో వేసిన డబ్బులను ఎరువులు, పురుగు మందులు, కూలీలకు ఖర్చు చేస్తూ ముందుకుసాగుతున్నాడు. ఆరో రోజైన మంగళవారం పలువురు రైతులకు ‘రైతుబంధు’ నగదు జమ కాగా అందుకొని.. ‘మా రైతులను అన్నితీర్ల ఆదుకుంటున్న కేసీఆర్.. రైతుబాంధవుడు’ అంటూ కొనియాడుతున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 3
ఏ ప్రభుత్వమూ పెట్టుబడి సాయం ఇయ్యలే..
డోర్నకల్ : ఏ ప్రభుత్వమూ కూడా ఇట్ల రైతులకు పెట్టుబడి సాయం ఇయ్యలే. ఎకరానికి రూ.5 వేలు చొప్పున సకాలంలో రైతుల అకౌంట్లో జమ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే. నాకు నాలుగు ఎకరాలకు రూ.20వేలు పడ్డయ్. ఇలా అన్ని విధాలా ఆదుకునే ముఖ్యమంత్రి ఉన్నందుకు రైతులు రుణపడి ఉంటరు. ఇదివరకు వ్యవసాయ పెట్టుబడి కోసం వ్యాపారుల దగ్గర బంగారు నగలు జమానత్ పెట్టి అప్పులు తెచ్చే వాళ్లం. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతుల కష్టాలు తీరినయ్. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్ వన్ స్థానంలో నిలిపాడు.
– శెట్టి అమరేందర్, పెరుమాండ్ల సంకీస
భారం నుంచి భరోసా వచ్చింది..
చిట్యాల : పంట దిగుబడి కోసం అష్టకష్టాలు పడి పెట్టుబడి పెట్టేది. నాకు మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు ఎకరాలు పత్తి, మిగతాది వరి సాగు చేసుకుంట. నిన్ననే నాకు రైతుబంధు పైసలు పడ్డయ్. సంబురంగా పోయి తెచ్చుకున్న. మునుపు పత్తి ఒక్కటే వేసేది. సీఎం కేసీఆర్ రైతుల కోసం తెచ్చిన సంక్షేమ పథకాలు, అనూకూల పరిస్థితుల వల్ల నీళ్లు పుష్కలంగా వస్తున్నయ్. అందుకే వరి పంటను రెండు దఫాలుగా పండిస్తున్నా. పెట్టుబడి సాయం కూడా సంవత్సరానికి రెండు సార్లు ఇయ్యడం వల్ల వ్యవసాయం చేయాలంటే ఉత్సాహంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ సారు వల్లే భరోసా వచ్చింది.
– జాలిగెపు కిష్టయ్య, కొత్తపేట, జయశంకర్ జిల్లా
పెట్టుబడికి మస్తు ఇబ్బందైతుండె..
దంతాలపల్లి : నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఎన్నో ఏండ్ల నుంచి వరి, పత్తి, మిరప పంటలు వేస్తున్న. ఒకప్పుడు పెట్టుబడులకు మస్తు ఇబ్బందైతుండె. వరి నాట్లు వేసినా పత్తి, మిరప పెట్టినా అప్పులు తెచ్చే కూలీలకు పైసలు ఇచ్చేది. కానీ కేసీఆర్ సార్ వచ్చినంక మా బాధలు తీరినయ్. రైతుబంధు కింద నాకు పసలుకు రూ.15వేలు బ్యాంకు ఖాతాల పడుతానయ్. తెలంగాణ గవర్నమెంటుల పెట్టుబడికి రంది లేకుంట అయింది. ఇదివరకు మా రైతులను ఏ సర్కారు సుత పట్టించుకోలె. ఇప్పుడు అండగా ఉంటున్న కేసీఆర్ సర్కార్కు రుణపడి ఉంట.
– నెమ్మది శంకరయ్య రైతు దంతాలపల్లి
ఇది రైతు కోసం ఆలోచించే సర్కారు..
కమలాపూర్ : రైతుబంధు పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రైతులను ఆదుకుంటాండు. ఎకరాకు 5వేలు ఇయ్యడం వల్ల పెట్టుబడి ఖర్చులు ఎల్లుతానయై. నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. యాసంగి, వానకాలం వరి వేసేముందు రైతుబంధు డబ్బులు అకౌంట్ల పడుతానయ్. ఇక పెట్టుబడి కోసం అప్పు తీసుకునే పనిలేకుంటైంది. ఇదివరకు ఏ సర్కారు కూడ రైతుల గురించి ఆలోచన చేయలేదు. రైతుకు 24గంటల కరంటు, పెట్టుబడికి సాయం చేసి ఆదుకుంటున్న గొప్ప నాయకుడు కేసీఆర్. రైతులను అదునుకు ఆదుకుంట.. రైతుబంధుతో ఎవుసాన్ని పండుగ చేసిండు.
– జక్కుల రాము, ఉప్పల్
రైతులకు మేలు చేసే సర్కార్
కృష్ణకాలనీ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు మాలాంటి పేద రైతులకు ఎంతో ఆసరా అయితాంది. ఇప్పటివరకు గిట్ల వ్యవసాయం చేసేందుకు ఏ ప్రభుత్వం కూడా పెట్టబడి సాయం ఇయ్యలేదు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు మేలు చేసే సర్కారును చూస్తున్నం. ప్రతి యేడు రైతుబంధు కింద డబ్బులిచ్చి సాయం చేసుట్ల మాకు అప్పులుచేసే బాధ తప్పింది. రైతుల కోసం ఇంత ఆలోచించే నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ ఒక్కడే. నిన్న టీవీల చూసిన ఆంధ్రా రైతులు కూడా కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. ఆయనే దేశాన్ని ఏలితే.. దేశ రైతులంతా సంతోషంగా ఉంటరు.
కష్టాలు తీరంగ.. సాగు సంతోషంగ..
రైతుబంధు మాకు వరం..
జనగామ రూరల్ : నాకు 3 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు డబ్బులు పడ్డయ్. ప్రతి సీజన్లో పంట వేసే సమయంలో ఠంచన్గా ఖాతాలో వేస్తున్నరు. గతంలో ఇక్కడ కరువు కాటకాల వల్ల నీళ్లు లేక రైతులు అరిగోస పడేది. ఇప్పుడు ఇబ్బందులు లేకుండా కాల్వలు, చెరువులు, బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉంటున్నయ్. ఇగ సర్కారు కరెంట్ ఫ్రీ ఇయ్యడం వల్ల ప్రతి గుంట సాగులోకి తీసుకచ్చినం. నాడు కరువుతో ఉన్న భూములు.. ఇయ్యాల పచ్చని పంటలతో కళకళలాడుతున్నయ్. రైతులకు రైతుబంధు వరం లాంటిది.