బచ్చన్నపేట/పాలకుర్తిరూరల్, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్తూ డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన హైదరాబాద్ నగరం పటాన్చెరు సమీపంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలింపూర్ గ్రామానికి చెందిన పాకాల నితిన్ (20), పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన రాగం భరత్చందర్(19) హైదరాబాద్లోని సుల్తాన్పూర్ జేఎన్టీయూలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. మరో స్నేహితుడు వంశీతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు సోమవారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో నితిన్, భరత్చందర్ అక్కడికక్కడే మృతి చెందారు. వంశీ తీవ్రంగా గాయపడడంతో చికిత్సకోసం దవాఖానకు తరలించారు. నితిన్, భరత్చందర్ మృతితో అలింపూర్, రాఘవపురంలో విషాదం నెలకొంది. నితిన్ తండ్రి పాకాల కిష్టయ్య ఏడాది క్రితం మృతి చెందగా, తల్లి సంతోష కూలి పనులు చేస్తూ చదివిస్తున్నది. రాగం భరత్చందర్కు ఇద్దరు అక్కలు. తల్లిదండ్రులకు ఇతనొక్కడే కొడుకు. భరత్చందర్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. ఇదిలా ఉండగా నితిన్ కుటుంబ సభ్యులను సర్పంచ్ నరెడ్ల బాల్రెడ్డి, ఎంపీటీసీ ఎండీ. మసూద్ పరామర్శించి సంతాపం తెలిపారు.