నల్లబెల్లి, ఆగస్టు 1: సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం మండలకేంద్రంలో పార్టీ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని, అధిక మెజార్టీ సాధించడమే ప్రతి కార్యకర్త ముందున్న లక్ష్యమన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గ్రామాల్లో ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ బలోపేతానికి పట్టుదలతో కృషి చేయాలని కోరారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడుతున్న నర్సంపేట నియోజకవర్గానికి ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ గోదావరి జలాలను తీసుకొచ్చి సస్యశ్యామలం చేశారన్నారు. త్వరలోనే గృహలక్ష్మి పథకం ద్వారా నియోజకవర్గంలో 5,400 ఇండ్లను అర్హులకు మంజూరు చేస్తామన్నారు. దళితబంధు పథకం ద్వారా మండలంలో 150 యూనిట్లు మంజూరు చేయన్నుట్లు వెల్లడించారు. అలాగే, రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా రెండు వేల యూనిట్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు వివరించారు.
మహిళలలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కుట్టు మిషన్ శిక్షణను ప్రారంభిస్తామన్నారు. మండలానికి పది కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక్కో శిక్షణ కేంద్రంలో 50 మంది మహిళలకు శిక్షణ ఇప్పించి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. త్వరలోనే నల్లబెల్లి మండలంలో శిక్షణను ప్రారంభిస్తామన్నారు. రైతులు ఎదురుచూస్తున్న రుణమాఫీ ప్రకటనను త్వరలోనే సీఎం కేసీఆర్ చేయనున్నారని తెలిపారు. గ్రామాలకు ప్రాధాన్యతా క్రమంలో వందశాతం సీసీరోడ్లు పూర్తి చేస్తామన్నారు. ప్రతి గ్రామాన్ని వందశాతం అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేయాలని పెద్ది సూచించారు. ప్రతిపక్ష నాయకుల అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీ ఫ్ల్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునీత, ప్యాక్స్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, మాజీ ఎంపీపీలు బానోత్ సారంగపాణి, కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, పార్టీ మండల కార్యదర్శి కొత్తపెల్లి కోటిలింగాచారి, క్లస్టర్ ఇన్చార్జిలు పాలెపు రాజేశ్వర్రావు, గందె శ్రీనివాస్గుప్తా, శివాజీ, మోహన్రెడ్డి, మాలోత్ ప్రతాప్, ఆర్ఎస్ఎస్ మండల కోఆర్డినేటర్ గోనెల పద్మ, కోఆప్షన్ మెంబర్ ఎండీ నజీమా పాల్గొన్నారు.