లింగాలఘనపురం, మార్చి 1 : ‘బీఆర్ఎస్ శ్రేణులంతా ఓపిక పట్టండి.. ఆరు నెలల్లోనే సీఎం సీటు కోసం కాంగ్రెసోళ్లు లొల్లి పెట్టుకుంటరు.. ఇప్పటికే చాలా మంది సీనియర్లు కస్సు బుస్సుమంటున్నారు.. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక.. సొంత కుంపట్లతో ఆగం చేస్తరు..’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో శుక్రవారం చేపట్టిన మేడిగడ్డ యాత్ర హైదరాబాద్-వరంగల్ హైవేపై నెల్లుట్ల బైపాస్ వద్దకు చేరుకోగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ ప్రాజెక్టులను కొల్లగొట్టిన సంస్కృతి కాంగ్రెస్దన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వ తవ్వకాలప్పుడు, బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తాను తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమించానన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ నేతలు కాళేశ్వరంపై కట్టు కథలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఐక్యంగా నిలిచి కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తుంటే అక్రమంగా కేసులు పెడుతున్నారని, దీనికి తాము భయపడమన్నారు. ‘మనం ఎవరి తెరువు పోవొద్దు.. మన తెరువుకు వస్తే ఊరుకోవద్దు.. టచ్ చేస్తే తాట తీద్దాం..’ అని పిలుపునిచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బరాజ్కు రూ.3 వేల కోట్లు వ్యయం చేస్తే కాంగ్రెస్ నేతలు దీనిని పెద్దగా చేసి చూపుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. బ్యారేజీలో కుంగిన పిల్లర్లను సరి చేస్తే సరిపోతుందన్నారు. కేటీఆర్ చేపట్టిన పర్యటన ప్రజలకు వాస్తవాలను తెలిపేందుకేనని ఆయన పేర్కొన్నారు. ఈ. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షకార్యదర్శులు బస్వగాని శ్రీనివాస్గౌడ్, గవ్వల మల్లేశం నాయకులు దూసరి గణపతి, మల్గ శ్రీశైలం, ఏదునూరి వీరన్న, బక్క నాగరాజు పాల్గొన్నారు.