అసమ్మతి జ్వాలలతో కాంగ్రెస్ ఇంకా అట్టుడుకుతున్నది. అభ్యర్థుల ప్రకటన తర్వాత పార్టీ పరిస్థితి ఆగమైంది. కష్టపడ్డ వారికి అవకాశం రాలేదనే ఆవేదనతో పలువురు పార్టీని వీడుతుండగా, మరికొందరు తమ దారి తాము చూసుకుంటామని చెబుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పార్టీ పెద్దలు ఎంత బుజ్జగించినా ‘ససేమిరా’ అంటూ అసంతృప్త నేతలు గరంగరంగానే ఉంటున్నారు. వారం ముందు పార్టీలో చేరి అభ్యర్థులుగా మారితే తమ పరిస్థితి ఏం కావాలని మండిపడుతున్నారు. ఇటు అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల వెంట తిరగలేక.. అటు తమ ‘నేత’కు టికెట్ రాక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.
వరంగల్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల చిచ్చు రగులుతూనే ఉన్నది. అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి అసమ్మతులు, అసంతృప్తులు పెరగడమే గానీ తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. పార్టీ కోసం పని చేసిన వారిని పక్కనబెట్టి అప్పటికప్పుడు వచ్చిన వారిని అభ్యర్థులుగా ప్రకటించినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి మొదలైంది. రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. కష్టపడిన నేతలకు అవకాశం రాలేదనే ఆవేదనతో పలువురు పార్టీని వీడుతున్నారు. మరికొందరు తమ దారి తాము చూసుకుంటామని చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని బుజ్జగింపులు చేసినా టిక్కెట్ల కేటాయింపుపై అసంతృప్తి మాత్రం అట్లనే ఉంటున్నది. హస్తం పార్టీ అధిష్టానం దూతలు, రాష్ట్ర నేతలు, జాతీయ నాయకు లు ఎవరు మాట్లాడినా అసమ్మతి ఇంకా తీవ్రమవుతున్నది. కాంగ్రెస్లో చేరగానే టిక్కెట్లు తెచ్చుకున్న నేతల కు ఇప్పుడు ఆ పార్టీలోని అందరినీ కలుపుకుని పోవ డం అసాధ్యంగా మారింది. వారం రోజుల ముందు పార్టీలో చేరి అభ్యర్థులుగా మారితే తమ పరిస్థితి ఏమిటని దశాబ్దాలుగా పార్టీలో ఉంటున్న నేతలు అంటున్నారు. ఎన్నిక ప్రక్రియ మొదలైనా అకస్మాత్తుగా అభ్యర్థులుగా మారిన వారి కోసం పని చేసేది లేదని గట్టిగా చెబుతున్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కె ట్ల పంచాయితీ సీరియల్లా సాగుతున్నది. నాయిని రాజేందర్రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంపై జంగా రాఘవరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గెలుపు ప్రాతిపదికగా కాకుండా కొనుక్కున్న వారికి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చిందని జంగా వర్గం అంటున్నది. బీఫారం ఇచ్చే వరకు ఎదురు చూస్తానని, అప్పటికీ పార్టీ నిర్ణయం మారకపోతే తన దారి తాను చూసుకుంటానని జంగా ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులతో రాఘవరెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వ హిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోతే ఇండిపెండెంట్గా పోటీలో ఉంటానని రాఘవరెడ్డి చెప్పారు. కాంగ్రెస్లోని ముఖ్యనేతలు, కీలక కార్యకర్తలు జంగా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్లో బలమైన నేతగా ఉన్న జంగా రాఘవరెడ్డితోనే ఉంటామని చెబుతున్నారు.
పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థిత్వం పెద్ద రచ్చగా మారింది. కాంగ్రెస్లో కనీసం సభ్యత్వం లేని రేవూరి ప్రకాశ్రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో పదేండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న ఇనుగాల వెంకట్రాంరెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2018 ఎన్నికల్లోనూ ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికే ఈ సీటు ఇచ్చారని, ఇప్పుడూ నాలుగు రోజుల ముందు పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ టిక్కెట్ ప్రకటించారని ఇనుగాల వర్గం వాపోతున్నది. పదేండ్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను పక్కనబెట్టి కొత్త నేతలకు అవకాశం ఇవ్వడం సరికాదని ఇనుగాల అంటున్నారు. ఏఐసీసీ ఆదేశాలతో ప్రత్యేక ఇన్చార్జిలు వచ్చి మాట్లాడినా ఇనుగాల వెనక్కి తగ్గడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఇనుగాల హాజరుకాలేదు. ఇనుగాల వర్గం మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నది.
వర్ధన్నపేటలోనూ కొత్తగా వచ్చిన కేఆర్ నాగరాజుకు కాంగ్రెస్ అభ్యర్థిత్వం దక్కింది. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నమిండ్ల శ్రీనివాస్ ఇన్నేండ్లు పార్టీ కోసం పని చేస్తున్నారు. నెల క్రితం పార్టీలో చేరిన నాగరాజుకు టిక్కెట్ ఇవ్వడంపై నమిండ్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్ధన్నపేటలో అధిక సంఖ్యలో ఉన్న మాదిగ వర్గానికి చెందిన నమిండ్లకు టిక్కెట్ ఇవ్వకపోవడంలో ఏదో మతలబు జరిగిందని అతడి అనుచరులు వ్యా ఖ్యానిస్తున్నారు. కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వడంపై అసంతృప్తితోనే ఉంటున్న నమిండ్ల శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నేతృత్వంలో జరిగిన సమన్వయ సమావేశానికి శ్రీనివాస్ హాజరు కాలేదు. బీఫారాలు ఇచ్చేటప్పుడు అయినా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మార్చుకోవాలని నమిండ్ల డిమాండ్ చేస్తున్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలోనూ కొత్తగా చేరిన వారికి టిక్కెట్ ఇవ్వడంపై సీనియర్లు అసమ్మతి జెండా ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కనీసం సభ్యత్వం లేని వారికి టిక్కెట్ ఇచ్చింది. పార్టీ కోసం ఏండ్ల నుంచి కష్టపడుతున్న వారికి పార్టీ కనీసం పరిగణలోకి తీసుకోలేదని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తమకు తెలియని పరిస్థితి ఉన్నదని అంటున్నారు. నియోజకవర్గంతో సంబంధం లేని, ఇతర దేశాల్లో ఉన్న వారిని అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ పరిస్థితి ఏమిటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.
జనగామ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్లో అసమ్మతి రగులుతున్నది. ఇక్కడ సైతం సీనియర్లను పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయేలా చేసి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారు ఏ మాత్రం సమంజసంగా లేదని ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. సీనియర్లు అందరూ సమావేశమై కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించేది లేదని అంటున్నారు.