మహబూబాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాలో పర్యటించనున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. మానుకోట జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయం, మెడికల్ కళాశాల, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని అన్నారు. గురువారం ఆమె మానుకోట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, మెడికల్ కళాశాల భవనాలు, ప్రధాన రహదారి నుంచి మెడికల్ కళాశాల వరకు నిర్మిస్తున్న వంద ఫీట్ల రోడ్డు, బయ్యారం రోడ్డులో సభాస్థలిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మానుకోట అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. అధునాతన హంగులతో నిర్మించిన కలెక్టరేట్, మెడికల్ కళాశాల, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్నిత్వరలోనే ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు జిల్లా కేంద్రంలో లక్ష మందితో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గిరిజన, గిరిజనేతర రైతులకు సభా వేదికపైనే అటవీ హక్కు పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో రూ.560 కోట్లతో మెడికల్ కళాశాల, రూ.62.50 కోట్లతో కలెక్టరేట్ నిర్మించుకోవడం గొప్ప విషయమన్నారు.
గిరిజన రిజర్వేషన్లు 10శాతానికి పెంచడంతో గిరిజనులకు విద్య, ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాస్రావు మృతి బాధాకరం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇది ప్రభుత్వ హత్య అనడం సరికాదని, కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గొత్తి కోయలకు ఈ ప్రాంతంపై ఎలాంటి హక్కు ఉండదనే విషయం మర్చిపోయి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అవగాహనా రాహిత్యంతో మాట్లాడి ప్రజలను ఇబ్బందిపెట్టొద్దని హితవు పలికారు. అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాన్ని ప్రోత్సహించకుండా కేంద్రం కావాలనే ఈడీ దాడులు చేయిస్తున్నదన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ దర్యాప్తు పేరిట టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నదన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయాయని ఆరోపించారు. దేశాన్ని దోపిడీ చేసిన వాళ్లను వదిలేసి రాజకీయ కక్షతో తెలంగాణ మంత్రులపై దాడులు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్, ఎస్పీ శరత్చంద్రపవార్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, అదనపు కలెక్టర్ డేవిడ్, బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్రెడ్డి పాల్గొన్నారు.