హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తేతెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైరెక్షన్లోనే కాంగ్రెస్ నేతలు హరీశ్రావుపై క్షుద్ర పూజలు చేశారంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ మండిపడ్డారు. హరీశ్రావు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు గోసుల శ్రీనివాస్ యాదవ్, అభిలాష్ రంగినేనితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు క్షుద్రపూజల పేరిట హరీశ్రావు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయం చేస్తున్నదని, గాంధీభవన్ను బూతుల భవన్గా మార్చారని మండిపడ్డారు.
అమ్మవారిని అవమానిస్తున్నారు
హరీశ్రావు క్షుద్రపూజలు చేశారంటూ అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. హిందువులు, మహిమాన్వితమైన అమ్మవారిని అవమానిస్తున్నారని, శివతత్వాన్ని అగౌరవపరుస్తున్నారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. గతంలో ఎన్టీఆర్పై కూడా శవపూజ చేశారని దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు. పాలన చేతగాక, ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ములేక ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘హరీశ్రావు అత్యంత పవిత్రమైన, శక్తిస్వరూపిణి అయిన శివమొగ్గ మూకాంబిక ఆలయాన్ని సందర్శిస్తే క్షుద్రపూజలు చేసినట్టా? అసలు క్షుద్రపూజలతో వర్షాలు ఆగుతాయా? కాంగ్రెస్ నేతలు అద్దంకి, రామ్మోహన్ చదువుకొన్నది ఇదేనా? కనీస ఇంగిత జ్ఞానం ఉన్నదా? సీఎం రేవంత్ మెప్పుకోసం ఇంతలా దిగజారాలా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గతంలో రేవంత్రెడ్డి కూడా అమ్మవారి ఆలయాన్ని సందర్శించారని, ఆయన కూడా ఉత్తమ్కుమార్, భట్టి, శ్రీధర్బాబు అడ్డు తొలగాలని, తానే సీఎంగా ఉండాలని క్షుద్రపూజలు చేశారా? అని నిలదీశారు. ‘గతంలో క్షుద్రపూజలు చేసినట్టు సీఎం రేవంత్రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయని, ఇప్పుడు కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మేలు కోసం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయుత చండీయాగం చేశారని చెప్పారు. కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం తెలంగాణ విధ్వంసానికి క్షుద్రపూజలు చేస్తున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. అమ్మవారిని అగౌరవపరిచిన కాంగ్రెస్ నాయకులు వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.