కవాడిగూడ, ఆగస్టు 3: వైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని శాసనమండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కాచం సత్యనారాయణగుప్తా ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద సాధన దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిరికొండ మధుసూదనాచారి దీక్ష చేస్తున్న కాచం సత్యనారాయణగుప్తాకు నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైశ్యులకు రాజ్యాధికారంలో రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. సమాజంలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఎదురైనా ముందుండి సమస్య పరిష్కారమయ్యేంత వరకూ కృషి చేసేది ఆర్యవైశ్యులేనని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలోనూ వైశ్యులు కీలక పాత్ర పోషించారని, సామాజిక సేవచేసేది వైశ్యులేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ వైశ్యులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్యవైశ్యులు చేసే పోరాటాలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. వైశ్య వికాస వేదిక అధ్యక్షుడు కాచం సత్యనారాయణ మా ట్లాడుతూ.. వైశ్య కార్పొరేషన్కు రూ. 500 కోట్ల నిధులు, 12 మంది డైరెక్టర్లను నియమించాలని కోరారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైశ్యులకు అన్ని రాజకీయ పార్టీలు జనాభా దామాషా ప్రకారం టికెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక నాయకులు హరిప్రసాద్, రాంనరేశ్, దైవాధీనం, కే సుష్మ, రమేశ్, కేవీ ప్రతాప్, వీరేందర్, నిఖిల్, రాజుగుప్తా, వేణు, శేఖర్, రాంబాబు, ప్రవీణ్, శ్యాంప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.