గీసుగొండ, డిసెంబర్ 30: సమాజంలోని పౌరులందరూ తమ హక్కులను పొందాలని కలెక్టర్ డాక్టర్ బీ గోపి అన్నారు. మండలంలోని విశ్వనాథపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. నిమ్న జాతుల వారిని కించపరిస్తే చట్టప్రకారం శిక్ష పడుతుందన్నారు. ప్రతి నెలాఖరులో గ్రామాల్లో సివిల్స్ రైట్స్ డే కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సదస్సులో ఎంపీపీ భీమగాని సౌజన్య, తహసీల్దార్ విశ్వనారాయణ, సర్పంచ్ అంకతీ నాగేశ్వర్రావు, మండల ప్రత్యేక అధికారి మురళీధర్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
అంటరానితనాన్ని నిర్మూలించాలి
నర్సంపేటరూరల్: రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నర్సంపేట ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. నర్సంపేట మండలంలోని ముగ్దుంపురం ఎస్సీకాలనీలో సర్పంచ్ పెండ్యాల జ్యోతి-ప్రభాకర్ అధ్యక్షతన పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఎక్కడైనా పౌరహక్కులకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివక్ష లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ వాసం రామ్మూర్తి, ఎస్సైలు మహేందర్రెడ్డి, రాధాకృష్ణ, ఆర్ఐ రజాక్, కార్యదర్శి రహీంపాషా, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ‘దళితబంధు’ అమలు
నెక్కొండ: దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నదని తహసీల్దార్ డీఎస్ వెంకన్న అన్నారు. నెక్కొండ మండలంలోని పనికర గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ పాల్గొని మాట్లాడారు. దళితబంధు పథకంలో ఎలాంటి పైరవీలు, దళారులకు తావు లేకుండా ప్రభుత్వం వెబ్సైట్ను తీసుకొచ్చిందని, అర్హులను కలెక్టర్ ఎంపిక చేస్తారన్నారు. దళిత, గిరిజన కుటుంబాలు ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుల బహిష్కరణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దని సూచించారు. సదస్సులో సర్పంచ్ పింగిళి విజయా మోహన్రెడ్డి, మండల పరిషత్ సూపరింటెండెంట్ జానకీదేవి, అధికారులు పాల్గొన్నారు.
రాజ్యాంగ ఫలాలు సమానంగా అందాలి
సంగెం/నల్లబెల్లి/పోచమ్మమైదాన్/రాయపర్తి/పర్వతగిరి/
చెన్నారావుపేట: రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాలని ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి అన్నారు. సంగెం మండలంలోని తీగరాజుపల్లిలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవాన్ని సర్పంచ్ కర్జుగుత్త రమ-గోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి పౌరుడూ సమానత్వంతో మెలగాలన్నారు. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు స్నేహభావంతో ఉండాలని కోరారు.
ప్రభుత్వ పథకాలను అర్హులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కొమురయ్య, తహసీల్దార్ రాజేశ్వర్రావు, ఎంపీటీసీ రంగరాజు నర్సింహస్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు. నల్లబెల్లి మండలం నారక్కపేటలో సివిల్ రైడ్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దూలం మంజుల హాజరై మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారి అబీదలీ, ఏవో పరమేశ్వర్, సర్పంచ్ వక్కల మల్లక్క, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాశీబుగ్గ 14వ డివిజన్ బాలాజీనగర్లో పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పౌర హక్కులపై రెవెన్యూ అధికారులు స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానికులు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తూర్పాటి సులోచనా సారయ్య, డీటీ రేణుక, ఆర్ఐ జలపతిరెడ్డి పాల్గొన్నారు. రాయపర్తి మండలం జగన్నాథపల్లి జీపీ ఆవరణలో సర్పంచ్ గూడెల్లి శ్రీలతా శ్రీనివాస్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. డీటీ ధరావత్ సూర్యానాయక్ హాజరై అవగాహన కల్పించారు.
గిర్దావర్ చంద్రమోహన్, కార్యదర్శి లక్ష్మీదేవి, శ్రీనివాస్, రాంచందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పర్వతగిరి మండలం తురుకల సోమారం గ్రామంలో నిర్వహించిన సదస్సులో అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స కోట మాట్లాడుతూ సామాజిక అసమానతలు తొలగించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కోరా రు. తహసీల్దార్ కోమీ, సర్పంచ్ రాపాక రేణుక పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలం బాపునగర్లో ఏర్పాటు చేసిన సదస్సులో పౌరహక్కులపై డీటీ మధుసూదన్ అవగాహన కల్పించారు. సర్పంచ్ మంగమ్మమేగ్యానాయక్, ఆర్ఐ స్వామి, ఐసీడీఎస్ సూపర్వైజర్ మంజుల, కార్యదర్మి మాలతి పాల్గొన్నారు.