బయ్యారం మార్చి 25 : కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశంలోని 90 శాతం సంపద కొద్ది మంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉందని, ప్రధాని మోదీ పేదలపై భారాలు మోపుతూ దోచుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. విభజన చట్టం హామీలను అమలు చేయాలని కోరుతూ బయ్యారం నుంచి హనుమకొండ వరకు సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర శనివారం మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సాంబశివరావు మాట్లాడుతూ బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతూ నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తోందన్నారు.
దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, జన్ధన్ ఖాతా తీసుకున్న వారికి రూ.15 లక్షల చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీలను ప్రధాని విస్మరించారని సాంబశివరావు విమర్శించారు. బడా కార్పొరేట్లు అదానీ, అంబానీ కొమ్ము కాస్తున్న ప్రధాని మోదీ దేశంలోని దొంగల ముఠాకు నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మతతత్వంతో ప్రజల మధ్య బీజేపీ చిచ్చుపెడుతున్నదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్నారని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం యత్నిస్తున్నదన్నారు.
బీఆర్ఎస్తో కలిసి ఐక్య పోరాటం
విభజన చట్టం హామీల్లో భాగంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోరాటం చేస్తామని కూనంనేని సాంబశివరావు అన్నారు. బయ్యారంలో 300 మిలియన్ టన్నుల నాణ్యమైన ఉక్కు ఉందని 2017లో పాల్వంచకు వచ్చిన కేంద్ర మంతి బీరేంద్ర సింగ్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అయినా పరిశ్రమ ఏర్పాటులో వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోసం సీఎం కేసీఆర్తో కలిసి ఢిల్లీలో పోరాటం చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. గతంలో దివంగత సీఎం ఎన్టీఆర్తో కలిసి పోరాడిన ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు.
రాహుల్గాంధీపై అనర్హత వేటు దుర్మార్గం
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయించడం దుర్మార్గమని కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని కాషాయ పార్టీ నాయకులను గ్రామాలకు రానివ్వొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్రావు మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విజయసారథి, ఉమ్మడి జిల్లా నాయకులు రాజిరెడ్డి, రవిబాబు, జ్యోతి, మండల కార్యదర్శి సారిక శ్రీను, నాయకులు రంగయ్య, కళింగరెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు.