Congress | కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా లేవు. డీసీసీ అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో దుమారం రేపుతున్నది. ‘ఎవరికి వారే.. యమునా తీరే’ అన్నట్లుగా గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. పనిచేసే వారికే అధిష్ఠానం పట్టం కట్టిందని పదవులొచ్చినవారు అంటుండగా, ఏకాభిప్రాయం లేకుండా ఎలా ఖరారు చేస్తారని అసంతృప్త వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా, మంగళవారం వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించిన పీసీసీ నాయకత్వం, జనగామ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిని మాత్రం పెండింగ్లోనే పెట్టింది. ఇక్కడ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కొత్తగా కాంగ్రెస్లో చేరిన కొమ్మూరి ప్రతాప్రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండడంతో డీసీసీ అధ్యక్ష పదవిని అలాగే వదిలేసింది. ఇక వరంగల్ తూర్పులోనూ ఇదే పరిస్థితి. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను డీసీసీ అధ్యక్షురాలిగా నియమించడంతో కొండా సురేఖ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా అయిత ప్రకాశ్రెడ్డిని నియమించడంతో భూపాలపల్లి కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు అసంతృప్తిగా ఉన్నారు.
– వరంగల్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో దుమారం రేపుతున్నది. పదవులు వచ్చిన వారు, రాని వారి మధ్య మరింత దూరం పెరగడంతోపాటు గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. పని చేసే వారికే అధిష్ఠానం అవకాశం ఇచ్చిందని పదవులు వచ్చిన వారు అంటుంటే.., ఏకాభిప్రాయం లేకుండా ఎలా ఖరారు చేస్తారనని అసంతృప్త వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఇప్పట్లో ఈ అసంతృప్త జ్వాలలు చల్లారేటట్లు లేవు. మొత్తంగా కాంగ్రెస్లో ఎప్పటిలాగే తాజాగా పదవుల పంపకం పలు వివాదాలకు కారణమవుతున్నది. కొత్త జిల్లాలకు అనుగుణంగా డీసీసీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పదవులనూ భర్తీ చేసింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో పీసీసీ స్థాయిలో నాయకత్వం మారింది. ఆ మేరకు జిల్లాల అధ్యక్షులుగా కొత్త వారిని నియమించింది.
ఈ ప్రక్రియనూ అయోమయంగా పూర్తి చేసింది. వరంగల్-హనుమకొండ జిల్లాలకు కలిపి నాయిని రాజేందర్రెడ్డిని నియమించిన నాయకత్వం, జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేయకుండానే వదిలేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీసీసీ పదవినీ భర్తీ చేయలేదు. డీసీసీ అధ్యక్షుడి మరణంతో ములుగు జిల్లా పదవి ఖాళీగా ఉన్నది. వరంగల్, హనుమకొండ జిల్లాలకు వేర్వేరుగా డీసీసీలు ఉండాలనే డిమాండ్ పెరగడంతో దీనికి అనుగుణంగా పీసీసీ నాయకత్వం మార్పులు చేసింది. తాజాగా, మంగళవారం వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించినా, జనగామ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిని మాత్రం అలాగే పెండింగ్లోనే పెట్టింది. కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాల కారణంగానే జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేయలేని పరిస్థితి కనిపిస్తున్నది.
జనగామ జిల్లా పాలకుర్తిలో కాకుండా వరంగల్ పశ్చిమలోనే తాను పోటీ చేస్తానని జంగా రాఘవరెడ్డి ప్రకటించడంతో పీసీసీ నాయకత్వం ఆయనను జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించలేదు. జనగామ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి రెండోసారి పదవిని కొనసాగించకపోవడంతో ఇక్కడ కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలు ఇంకా పెరిగాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కొత్తగా కాంగ్రెస్లో చేరిన కొమ్మూరి ప్రతాప్రెడ్డి వర్గాల మధ్య పోరు తీవ్రంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా రెండు వర్గాలు పోటాపోటీగా ప్రచారాలు చేసి శ్రేణుల్లో చులకనవుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క పాదయాత్రల్లోనూ రెండు వర్గాలు కొట్టుకున్నాయి. వర్గ పోరు పరస్పరం ముఖ్యనేతల బహిష్కరణల వరకు వెళ్లింది.
వరంగల్లోనూ…
వరంగల్ డీసీసీ అధ్యక్ష ఎన్నికపైనా కాంగ్రెస్లో వర్గపోరు కొనసాగుతున్నది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కొండా సురేఖ వచ్చే ఎన్నికల్లో ఇక్కడే పోటీ చేస్తానని ప్రకటించారు. వివిధ కార్యక్రమాలతో నియోజకవర్గంలోనూ పర్యటిస్తున్నారు. పీసీసీ నాయకత్వం కొండా సురేఖను పరకాల నియోజకవర్గంలో పోటీ చేయాలని సూచించినా ఆమె వరంగల్ తూర్పులోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. పీసీసీ నాయకత్వం తాజాగా మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను డీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది. కొండా సురేఖ, మురళీధర్రావు ప్రతిపాదనలకు భిన్నంగా ఈ నియామకం జరగడంతో వీరు అసంతృప్తితో ఉన్నారు.
వరంగల్ డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పుడు వరంగల్ తూర్పులో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఇద్దరు మహిళా నేతల మధ్య కొత్త పోరు మొదలవుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా అయిత ప్రకాశ్రెడ్డిని నియమించడంపై భూపాలపల్లి కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు అసంతృప్తిగా ఉన్నారు. ఇలా డీసీసీ అధ్యక్ష పదవుల భర్తీ కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలను మరింత పెంచుతున్నది.