న్యూఢిల్లీ: శాంతియుత నిరసనలు రాజ్యాంగబద్ధమైన రక్షణ కలిగినవని, కేవలం ఆందోళన సాకుతో లాఠీచార్జ్ చేయడం సమర్థనీయం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పోలీసుల అధిక బల ప్రయోగాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హింసకు తావు లేకుండా జరిగే నిరసనలను గౌరవించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆందోళనలు నియంత్రించడానికి ఒకే రకమైన పోలీసు విధి విధానాలు ఉండాలని కోర్టు నొక్కి చెప్పింది.
పోలీసులకు రక్షణ లేదా?
విద్యార్థులు చేపట్టిన నిరసనల సమయంలో జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారీ ప్రదర్శనలు ఎదుర్కొనే క్రమంలో పోలీసు సిబ్బందికి తగిన సంరక్షణ చర్యలు, హెల్మెట్లు వంటి రక్షణ సామగ్రిని ఎందుకు అందించలేదని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కోరనున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. ధర్మాసనం ముందుకు ఈ అంశానికి సంబంధించిన వ్యాజ్యాలు వచ్చినప్పడు పోలీసుల కుటుంబాల తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, ఆందోళనల సమయంలో కొందరు పోలీసులు తీవ్ర దాడులకు గురయ్యారని తెలిపారు. దీనికి జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ, నిరసనకారులైనా, పోలీసు అధికారులైనా ఏ వ్యక్తులకైనా తగిలే గాయం న్యాయస్థానానికి సమానమేనని అన్నారు.