మహదేవపూర్ (పలిమెల), జూలై 27 : నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో మనస్థాపానికి గురైన మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అహల్యనగర్ జిల్లా జలాల్పూర్ గ్రామానికి చెందిన అంకితా సాంగ్లే గత శనివారం తన ఇంట్లో సూసైడ్ చేసుకోగా, ఆమె మృతదేహం లభ్యమైంది.
‘నీట్ పరీక్షకు చదువుతున్నప్పుడు నా కోసం మీరు ఎంతో త్యాగం చేశారు. కానీ మీ ఆశలను నేను నెరవేర్చటంలో విఫలమయ్యా’ అంటూ సూసైడ్ లెటర్లో విద్యార్థిని పేర్కొన్నది. నీట్ పరీక్షలో కేవలం 166 మార్కులు రావటంతో ఆమె తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరాఠీ భాషలో ఆమె రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెనకు చెందిన విద్యార్థిని పాగే కృష్ణవేణి నీట్లో ఆశించిన మారులు రాలేదని మనస్తాపం చెంది సోమవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను భూపాలపల్లిలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం కృష్ణవేణి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.