రైతుబంధు పథకం ద్వారా నగదు జమ ప్రారంభమైంది. తొలిరోజు ఎకరం వరకు ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు 11వ విడుత డబ్బులను జమ చేశారు. వరంగల్ జిల్లాలో 59,249 మందికి రూ.17.26 కోట్లు.. హనుమకొండ జిల్లాలో 55,712 మంది రైతులకు రూ.16.12 కోట్లు జమయ్యాయి. అదునుకు ముందే సర్కారు సాయమందడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు పెట్టుబడి రంది తీర్చిందని ఉత్సాహంగా పొలంబాట పడుతున్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో బిజీగా మారారు.
వరంగల్, జూన్ 26 (నమస్తేతెలంగాణ)/హనుమకొండ సబర్బన్ : రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రైతులకు తొలివిడుత పంట పెట్టుబడి సాయం పంపిణీని సోమవారం ప్రారంభించింది. తొలిరోజు వరంగల్ జిల్లాలో 59,249 మంది రైతులకు రూ.17,26,06,567 ఆర్థిక సాయం అందజేసింది. హనుమకొండ జిల్లాలో 55,712 మందికి రూ.16.12 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. పంట పెట్టుబడి సాయాన్ని అందుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రైతు పక్షపాతిగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహించేందుకు రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం ఒక్కో ఎకరానికి రెండు విడుతల్లో రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది. తొలివిడుత వానకాలం రూ.5 వేలు, రెండో విడుత యాసంగి రూ.5 వేల చొప్పున పంపిణీ చేస్తున్నది. సీజన్ ప్రారంభంలోనే ఈ ఆర్థిక సహాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. ఎకరంలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు తొలుత.. ఇలా కొద్దిరోజుల్లోనే అందరికీ అందజేస్తున్నది. ఈ ఆర్థిక సాయాన్ని రైతులు పంట పెట్టుబడి కోసం వినియోగిస్తున్నారు. విత్తనాలు, ఎరువులను కొంటున్నారు.
పంటల సాగులో ఇతర ఖర్చులకూ వెచ్చిస్తున్నారు. సోమవారం నుంచి పంట పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాలో అధికారులు జమ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రైతుబంధు నిధులను ట్రెజరీకి పంపింది. ట్రెజరీ ద్వారా ఎకరంలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాలో పెట్టుబడి సా యం జమ చేయాలని పేర్కొంది. ఈ ఏడాది తొలివిడుత 1,54,405 మంది రైతులకు రూ.136,47,64,319 పం ట పెట్టుబడి సాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో తొలిరోజు 59,249 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.17,26,06, 567 ఆర్థిక సాయం జమ చేసింది. పంట పెట్టుబడి సాయం డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు సెల్కు వచ్చిన మెసేజ్ చూసిన రైతులు మురిసిపోయారు. విత్తనాలు, ఎరువులు కొనడానికి వాడుకున్నారు.