అయిజ, ఆగస్టు 10 : అల్లరి మూకల చేతుల్లో ఆ ఇంటి దీపం ఆరింది. అల్లారు ముద్దుగా పెంచి, డాక్టర్గా విద్యాభ్యాసం చేయించి నడిగడ్డ ప్రజానీకానికి వైద్య సేవలు అందించాలనే సంలక్పంతో తల్లిదండ్రులు చంద్రకళ, వెంకటేశ్ తపన పడ్డారు. వారి ఆశలను వమ్ము చేస్తూ తాగుబోతుల చేతుల్లో బలైపోయిన డాక్టర్ ప్రియాంక భౌతికకాయానికి అయిజ, ఎక్లాస్పురం గ్రామస్తులతోపాటు బంధుమిత్రులు కన్నీటితో నివాళులర్పించారు. సోమవారం డాక్టర్ ప్రియాంక భౌతికకాయం అయిజ పట్టణానికి చేరుకోగానే అయిజ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అంతిమయాత్ర చేపట్టారు. అయ్యప్పస్వామి ఆలయం నుంచి కొత్త బస్టాండ్ కూడలి వరకు అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం డాక్టర్ సొంత గ్రామం ఎక్లాస్పురానికి తరలించారు. డాక్టర్ ప్రియాంక మృతికి కారకులైన నిందితులకు ఫాస్ట్స్టాక్ కోర్టు ఏర్పాటు చేసి అనతికాలంలో కఠిన శిక్ష అమలు చేసేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ముక్తకంఠతో నినదించారు.
ఏడు రోజులపాటు నరకయాతన పడి మరణించిన మెడికో ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితులకు తక్షణమే శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతిమ యాత్రలో జనం తండోపతండాలుగా తరలిరావడంతో ఎక్లాస్పూర్ కన్నీటి జనసంద్రంగా మారింది. అంతిమయాత్రకు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు గ ద్వాల ఎమ్మెల్యే హాజరై నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. డాక్టర్ ప్రియాంక మృతికి కారకులైన నిందితులకు కఠిన శిక్షణ అమలు చేసేలా ఏపీ సర్కారుతో చర్చలు జరుపుతామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితులకు తక్షణమే శిక్ష ఖరారయ్యేలా చూస్తాని, ప్రభుత్వ పరంగా కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు.
ఏపీ ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్ష పడేలా తక్షణమే ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పాత బస్టాండ్ సర్కిల్లో అఖిలపక్ష కమిటీ నాయకులు మెరుపు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితులకు ఫాస్ట్ట్రాక్ కోర్టులో 3 నెలల్లోనే శిక్ష పడేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డా క్టర్ ప్రియాంక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 3 కోట్లు ఎక్స్గ్రేసియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మెడికో ప్రియాంక సొంత గ్రామంలో తీవ్ర విషాదంలో మునిగింది. గ్రామానికి చెందిన డాక్టర్ మృతి చెందిందనే వార్త విన్న గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. సోమవారం గ్రామానికి ప్రియాంక భౌతికకాయం చేరగానే ఆమె కుటుంబ సభ్యుల ఇండ్ల వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులు ముగ్గురు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో కర్నూల్, హైదరాబాద్ పట్టణాలకు వెళ్లారని గ్రామస్తులు వాపోయారు. ఉన్నత చదువులు చదివి గ్రామానికి మంచిపేరు తీసుకొస్తారని ఆశించిన గ్రామస్తులకు తాగుబోతుల అరాచకంతో మెడికో మృతి చెందిందని తెలుసుకొన్న ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
డాక్టర్ ప్రియాంక కేసులోని నిందితులకు కఠిన శిక్ష పడేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం ఎక్లాస్పురం గ్రామానికి చేరుకున్న మంత్రి డాక్టర్ ప్రియాంక మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కోరిక మేరకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసే విధంగా సీఎం చంద్రబాబుతో మాట్లాడుతామన్నారు. నిందితులు ఎంతటి వారైన కఠిన శిక్ష పడాల్సిందేనని పేర్కొన్నారు. అంతకు ముందు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును తండ్రికి అందజేశారు. కిమ్స్లో వైద్య ఖర్చులను రీయింబర్స్మెంట్ చేస్తామని, పీజీకి చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలకు జిల్లా పోలీస్శాఖ భారీ బందోబస్త్ ఏర్పాటు చేసింది. ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ శంకర్ ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు. అయిజ, ఎక్లాస్పురం గ్రామాల్లో మఫ్టీ లో పోలీసులను దింపా రు. మంత్రుల పర్యటన దృష్ట్యా రోప్పార్టీలను ఏర్పాటు చేశారు.