రాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం తెస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, దేవాదాయ శాఖ కార్యాలయాన్ని సైతం ఆలయంలా నిర్మించి ఆ శాఖ చరిత్రలోనే నవశకాన్ని తెచ్చింది. చారిత్రక ఓరుగల్లు పేరుకు తగినట్లుగానే నగరంలో రూ.3కోట్లతో నిర్మించిన దేవాదాయ శాఖ (ధార్మిక భవన్) కార్యాలయం చూడ ముచ్చటగా ఉంది. మల్టీజోన్ పరిధిలోని 19 జిల్లాల దేవాదాయ శాఖ పరిపాలనా వ్యవహారాలు ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి. ఈ నెల 21న వరంగల్ ధార్మిక భవన్ను ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు కొనసాగుతుండగా, నగరానికి ఇది మరో మణిహారంలా ఉండనుంది.
– వరంగల్, సెప్టెంబరు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, సెప్టెంబర్14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. మన నిధులు మనకే ఖర్చు చేస్తుండడంతో ఆలయాలు, దేవాదాయ శాఖ కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఇందుకు వరంగల్లో నిర్మించిన ధార్మిక భవనే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. మల్టీజోన్ పరిధిలోని 19 జిల్లాల దేవాదాయ శాఖ పరిపాలన వ్యవహారాలు వరంగల్ నుంచే కొనసాగేలా నగరంలో నిర్మించిన దేవాదాయ శాఖ (ధార్మిక భవన్) కార్యాలయం విశేషంగా ఆకట్టుకుంటున్నది. చూసేందుకు అచ్చు ఆలయంలా ఉన్న ఈ భవనంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మేడారం సమ్మక్క-సారలమ్మ ఈవో, సంబంధిత శాఖ ఇంజినీరింగ్ విభాగం కార్యాలయాలు ఉంటాయి. ఈ నెల 21న వరంగల్ ధార్మిక భవన్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ కలిసి ధార్మిక భవన్ను ప్రారంభించనున్నారు.
1040 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణం
భవన నిర్మాణం కోసం 2020 నవంబర్ 11న శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్లతో 1040 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు. నాలుగు అంతస్తుల భవనంలో పెద్ద కాన్ఫరెన్స్ హాలు ఉంది. శంకుస్థాపన చేసిన మూడేండ్లలోపే భవన నిర్మాణం పూర్తయ్యింది. దేవాదాయ శాఖకు సొంతంగా ఇంత పెద్ద భవనం నిర్మించడం ఇదే తొలిసారి అని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది సాధ్యమైందని అంటున్నారు.
తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆలయాలకు కొత్త కళ వచ్చి తెలంగాణలో ఆధ్మాత్మిక వెల్లివిరుస్తున్నది. రూ.వందల కోట్లతో ఆలయాలను రాష్ట్ర సర్కారు అభివృద్ధి చేసింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని వెయ్యికి పైగా ఆలయాలను బాగుచేసింది. సీఎం కేసీఆర్ 11కిలోల 650 గ్రాముల బంగారు కిరీటాన్ని స్వయంగా భద్రకాళీ అమ్మవారికి సమర్పించి మొక్కు చెల్లించారు. భద్రకాళీ ఆలయ మాడవీధులకు రూ.30కోట్లు మంజూరు చేశారు. కాళేళ్వరం ఆలయానికి రూ.25 కోట్లు, కురవి ఆలయానికి రూ.5కోట్లు, ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి రూ.2 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయించారు. ప్రత్యేక అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఆలయాల్లో వసతులు కల్పించారు. ఆదాయం లేని ఆలయాలను ఉమ్మడి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కనీసం దేవుడికి దీపం పెట్టేందుకు నిధులు కూడా మంజూరు చేయలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 442 ఆలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోనికి తెచ్చారు. ఈ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని సీఎం కేసీఆర్ రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్దదయిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరను బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి రెండేళ్లకోసారి వైభవంగా నిర్వహిస్తున్నది. కోటి మంది వచ్చే ఈ జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించింది. నాలుగు జాతరలకు కలిపి రూ.334కోట్లతో అభివృద్ధి పనులు చేసింది. హరిత హోటల్తో పాటు కాటేజీలను నిర్మించింది. మేడారం జాతరలో ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చేసిన అభివృద్ధితో భక్తులకు ఇబ్బందులు తప్పాయి.