నర్సంపేట రూరల్, నవంబర్ 29: నర్సంపేట పట్టణంలో నిర్మిస్తున్న సర్కారు దవాఖాన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 10 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతులమీదుగా నిధుల విడుదల జీవో కాపీని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలు, చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రిని మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న నర్సంపేట ఏరియా దవాఖానను అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం అనుమతులు కూడా జారీ చేసిందన్నారు. ఇటీవల రూ. 58 కోట్ల నిధులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంజూరు చేయగా, నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రహరీ, గ్రీనరీ, స్టాఫ్ క్వార్టర్లు, రోగుల అటెండెంట్ షెడ్, ఇంటర్నల్ సీసీరోడ్డు, ఇతర సదుపాయాల కోసం అదనంగా రూ. 10 కోట్ల నిధులను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసినట్లు వివరించారు. గతంలో నర్సంపేట పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్రావు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో మరో రూ. 10 కోట్ల నిధులను విడుదల చేయడం హర్షణీయమన్నారు. ఈ పనులకు అతిత్వరలో టెండర్లు పిలిచి ప్రారంభిస్తామన్నారు. మరో ఆరు నెలల్లో అధునాతన దవాఖాన ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు. నిధుల విడుదలకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు ఈ సందర్భంగా పెద్ది కృతజ్ఞతలు తెలిపారు.