కొండాపూర్, ఆగస్టు 1 : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ జ్యువెల్లరీ దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ దొంగతనం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చందానగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పకనే ఉన్న శ్రీ బాలాజీ జ్యువెల్లరీ దుకాణం వెనుక భాగంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ను తొలగించి.. గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు, వెనుక గది నుంచి ముందు గదికి మధ్య ఉన్న తలుపునకు కన్నం చేసి షాప్లోని బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
ప్రాథమిక అంచనా ప్రకారం.. సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ సీహెచ్. శ్రీనివాస్ కుమార్, సీసీఎస్, ఎస్ఓటీ, చందానగర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు.