గిర్మాజీపేట, జూలై 27 : వరదలతో ప్రజలెవరూ భయపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం రాత్రి ఆయన హంటర్రోడ్డులోని సాయినగర్కాలనీ, ఎన్టీఆర్నగర్కాలనీ, బృందావనకాలనీ, సంతోషిమాతకాలనీల్లోని జలమయమైన లోతట్టుప్రాంతాలను కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ షేక్రిజ్వానాభాషాలతో కలిసి పర్యటించారు. మోకాళ్లలోతులో ఉన్న నీటిలో మంత్రి నడుస్తూ వరద బాధితులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు. సంతోషిమాత గుడి దగ్గర నీటిలో చిక్కుకుపోయిన ఓ వృద్దురాలిని ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్, కమిషనర్ రెస్యూటీం సభ్యులతో పడవలో స్వయంగా వెళ్లి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితిని సీఎం కేసీఆర్ స్వయంగా సమీక్షిస్తున్నారన్నారు.
ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఫోన్చేసి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారన్నా రు. ముంపు ప్రాంతాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు. ఈ ప్రకృతి విలయానికి తల్లడిల్లిన ప్రాంతాల్లో ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతున్నదన్నారు. రెస్క్యూ టీంలు, గజ ఈతగాళ్లు, పడవలను అందుబాటులో ఉంచామని వారు సహాయక చర్యల్లో అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. అలాగే, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. నీట మునిగిన ప్రాంతాల ప్రజలకు నీరు, ఆహారం అందజేస్తున్నామన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి వరద ముంపు నివారణ జరిగే వరకు ఆయా కలెక్టర్ల ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు పనిచేస్తాయని.. అలాగే సహాయకచర్యలు కొనసాగుతాయని ఆ పనులను పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వ యంత్రాం గం, అధికారులు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారన్నారు. ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దని తమ సమస్యలేమైనా ఉంటే టోల్ఫ్రీ నంబర్కు కాల్చేయాలని తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు తాను, ఎమ్మెల్యేలు, మేయర్, కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అందరూ అందుబాటులో ఉంటారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. వారివెంట కార్పొరేటర్ గందె కల్పన, బీఆర్ఎస్ నేత నవీన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.