హరితహారం ప్రగతికి సోపానమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మైలారం గ్రామంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో జిల్లా అటవీ శాఖాధికారి వసంత సారథ్యంలో తెలంగాణ హరితోత్సవం నిర్వహించారు. తొలుత కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి దశాబ్ది సంపద వనంలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. మొక్కలను కన్నబిడ్డల వలె కాపాడుకుంటేనే భావితరాల మనుగడ సాధ్యమని, వనాల పెంపుతోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నారు. తర్వాత మొక్కలు నాటి సంరక్షిస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
రాయపర్తి, జూన్ 19 : హరితహారం ప్రగతికి సోపానం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో మండలంలోని మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో డీఎఫ్వో వసంత సారథ్యంలో తెలంగాణ హరితోత్సవం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖాధికారులు, ప్రభుత్వ అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో కలసి సర్పంచ్ లేతాకుల సుమతీ యాదవరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన తెలంగాణ దశాబ్ది సంపద వనంలో మొక్కలు నాటారు.
అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమాలు రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఎంతగానో ఉపకరిస్తున్నట్లు చెప్పారు. గతతంలో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆలోచనతో హరితహారం ప్రవేశపెట్టి, రాష్ట్రవ్యాప్తంగా ఏటా మొక్కలు నాటి, సంరక్షించడంతో అడవుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నట్లు వివరించారు. దీంతో పదేళ్లుగా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న విషయం ప్రజలకు తేటతెల్లమైందన్నారు. వన మహోత్సవాలు, తెలంగాణకు హరితహారం కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో నాటుతున్న మొక్కలన్నింటిని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు కాపాడాలని, వృక్షాలను సంరక్షిస్తేనే భవిష్యత్తరాలకు మనుగడ ఉంటుందన్నారు.
దేశమే అబ్బురపడేలా గ్రీన్ ఫండ్
రాష్ట్రంలో పచ్చదనం, మొక్కల పెంపకం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభు త్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాల నుంచి శాశ్వత గ్రీన్ ఫండ్ను ఏర్పాటు చేశారన్నా రు. అంతేగాక ప్రభుత్వ నిర్వహణలో జరిగే కాంట్రాక్ట్లు, పనులన్నింటిలోనూ గ్రీన్ ఫండ్, గ్రీనరీల కోసం కొంత భాగాన్ని కేటాయించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మొక్కల సంరక్షణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తెలంగాణకు హరితహారం-తెలంగాణ హరితోత్సవాలపై జిల్లా అటవీశాఖ నేతృత్వంలో ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు.
మొక్కలు నాటుతామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు, ఎఫ్ఆర్వో సదానందం, డీఆర్వో కర్ణానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, నాయకులు పూస మధు, గాడిపల్లి వెంకన్న, ఎలమంచ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోతు కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏవో గుమ్మడి వీరభద్రం, ఏపీవో దొణికెల కుమార్గౌడ్, ఏపీఎం పులుసు అశోక్కుమార్, గిర్ధావర్ కొయ్యాడ చంద్రమోహన్, ఇరిగేషన్ శాఖ డీఈ కిరణ్కుమార్, ఏఈ బాలదాస్, అనూష, పీఆర్ డీఈ వాసం బాబూరావు, ఏఈ కార్తీక్రెడ్డి, లాల్సింగ్, కిషన్, పంచాయతీ కార్యదర్శి పెంచల విజేందర్, కారోబార్ గూడెల్లి ఉప్పలయ్య, గూడెల్లి వెంకన్న, గబ్బెట బాబు, ఆష్రఫ్పాష, ఎల్లస్వామి పాల్గొన్నారు.