ములుగు.. మున్సిపాలిటీగా అవతరించనుంది. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారనుంది. బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామ పంచాయతీలతో కలిసి ఏర్పాటు కానుంది. అసెంబ్లీలో మంగళవారం తెలంగాణ పురపాలక చట్టం-2019 సవరణ బిల్లును ఆమోదించడంతో ఇందుకు మార్గం సుగమమైంది. ములుగు 2019లో జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటికీ మేజర్ గ్రామ పంచాయతీగానే కొనసాగుతోంది. మున్సిపాలిటీగా మార్చేందుకు రెండు రోజుల క్రితం జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో అసెంబ్లీలో పురపాలక చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందింది. దీంతో ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం 2024లో పూర్తయిన తర్వాత మున్సిపాలిటీ సేవలు ప్రారంభం కానున్నాయి. మున్సిపాలిటీ ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్, ఎమ్మెల్యే సీతక్క .. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు సంబురాలు జరుపుకొంటున్నారు.
ములుగు, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీ కానుంది. ప్రస్తుతం మేజర్ గ్రామపంచాయతీ కేంద్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో మంగళవారం తెలంగాణ పురపాలక సవరించే బిల్లును ఆమోదింపజేసినందున ములుగు మున్సిపాలిటీగా మారనుంది. ప్రస్తుత గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుల పదవీ 2024 ఫిబ్రవరిలో పూర్తయిన తర్వాత ప్రజలకు మున్సిపాలిటీ సేవలు అందనున్నాయి. సీఎం కేసీఆర్ ఇటీవల ములుగు జిల్లాలో పర్యటించిన సమయంలో ఏటూరునాగారంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీ చేయాలని కోరారు. ఈమేరకు ముఖ్యమంత్రి శాసనసభలో పురపాలక సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టి ములుగును మున్సిపాలిటీగా మార్చేందుకు కృషిచేశారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ములుగు 2019 ఫిబ్రవరి 17న జిల్లాగా ఏర్పడింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మున్సిపాలిటీగా మార్చేందుకు జిల్లా ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కమిషన్కు ఇటీవల ప్రతిపాదనలు పంపారు. ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామ పంచాయతీలను కలుపుకొని జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీ చేసేందుకు ఆయా పంచాయతీ పాలకవర్గాల తీర్మానాలను పంపారు. దీంతో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో పురపాలకచట్టం 2019ను సవరణ చేసేందుకు ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. మూడు గ్రామపంచాయతీలను కలుపుకొని 2011 జనాభా లెక్కల ప్రకారం 16,533 ఉండగా, ఓటర్లు 12,486 మంది ఉన్నారు. 2022 జనాభా లెక్కలు పూర్తయితే, ప్రస్తుత జనాభాతో ఓటర్లు మరో 25శాతం పెరగనున్నారు.
ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లిలతో..
ములుగు మేజర్ గ్రామపంచాయతీలో జనాభా తక్కువగా ఉందని మున్సిపాలిటీ ప్రక్రియకు ఇప్పటివరకు ఆటంకాలు ఏర్పడ్డాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి చట్టాన్ని సవరించడంతో ములుగు, బండారుపల్లి, గ్రామ పంచాయతీలను కలుపుకొని మున్సిపాలిటీగా ఏర్పాటు కానున్నది. ములుగు జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బండారుపల్లి, జీవంతరావుపల్లి జీపీలను మున్సిపాలిటీలో విలీనం చేయనున్నారు. ములుగు గ్రామపంచాయతీ పరిధిలో పాల్సాబ్పల్లి, రంగారావుపల్లి, ప్రేమ్నగర్, మాధవరావుపల్లి గ్రామాలు ఉన్నాయి. జీవంతరావుపల్లిలో గణేశ్లాల్పల్లి శివారు గ్రామం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ములుగులో 16వార్డులు, 4 శివారు పల్లెలతో కలుపుకొని 12,135 జనాభా 9,422 ఓటర్లు ఉన్నారు. బండారుపల్లిలో 12వార్డుల్లో 3,187 జనాభా, 2,436 మంది ఓటర్లు ఉన్నారు. జీవంతరావుపల్లిలో శివారు పల్లెతో కలుపుకొని 8వార్డులు, 1,211 జనాభా 628 ఓటర్లు ఉన్నారు.
మున్సిపాలిటీ ఏర్పాటుపై సంబురాలు
ములుగు రూరల్: ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ములుగును మున్సిపాలిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మున్సిపాలిటీ చట్టం సవరణ బిల్లును ఆమోదించిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్రాంనాయక్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు విజయ్, నవీన్, నాయకులు సాగర్, కాసీం, కోగిల మహేశ్, రఘు, రాజాహుస్సేన్ ఉన్నారు.
కేటీఆర్కు సీతారాంనాయక్ కృతజ్ఞతలు
ములుగు, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ములుగు కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మానుకోట మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ మంగళవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కేంద్రంగా ఉన్న ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి పురపాలక చట్టాన్ని సవరించేందుకు శాసనసభలో బిల్లును ఆమోదింపజేశారని తెలిపారు. ఎంతో కాలంగా ఉన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే సీతక్క ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులైన సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావుకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. జిల్లా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కలెక్టరేట్ నిర్మాణం చేయాలని కోరారు. అలాగే జిల్లా విద్యుత్ శాఖ అధికారిని నియమించాలన్నారు. దీంతోపాటు ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరారు. మల్లంపల్లిని మండలంగా ప్రకటించాలన్నారు. ములుగు స్టేషన్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.