వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన వంద పడకల దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన గర్భిణులు, రోగులు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది నెలల్లో 807 ప్రసవాలు జరిగాయి. ఇందులో 382 సాధారణ, 425 సిజేరియన్లు చేశారు. పుట్టిన పిల్లల కోసం ఫొటో థెరపీ యంత్రా లు, అత్యాధునిక ఐసీయూ యూనిట్ను నెలకొల్పారు. అంతేకాకుండా ఆస్పత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ను నెలకొల్పారు. రూ.1.25 కోట్లతో కొత్త డయాగ్నస్టిక్ హబ్ను నిర్మిస్తుండగా త్వరలో పూర్తికానుంది. రూ.16.60 లక్షలతో ఆర్టీపీసీఆర్ ల్యాబొరేటరీ, రూ.54 లక్షలతో 20 పడకల పిల్లల ప్రత్యేక సంరక్షణ విభాగం, రూ. 3.65 లక్షలతో ఎన్సీడీ క్లినిక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే వైద్యశాలలో పోస్టుమార్టం సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
భూపాలపల్లిటౌన్, నవంబర్ 23 : టీఆర్ఎస్ ప్రభు త్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రూ.29.46 కోట్లతో నిర్మించిన జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన గర్భిణులు, రోగులు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రైవేట్కు దీటుగా వైద్యం అందుతుండగా ఔట్ పేషెంట్ బ్లాక్లోనూ అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
దవాఖానలో పెరిగిన ప్రసవాలు
జిల్లా ఆస్పత్రిలో గడిచిన ఎనిమిది నెలల్లో 807 ప్రసవాలు జరిగాయి. ఇందులో 382 సాధారణ, 425 సిజేరియన్లు చేశారు. ఏప్రిల్లో 30 సాధారణ, 44 సిజేరియన్, మే నెలలో 50 సాధారణ, 41 సిజేరియన్, జూన్లో 45 సాధారణ, 42 సిజేరియన్, జూలైలో 40 సాధారణ, 69 సిజేరియన్, ఆగస్టులో 49 సాధారణ, 48 సిజేరియన్, సెప్టెంబర్లో 41 సాధారణ, 51 సిజేరియన్, అక్టోబర్లో 67 సాధారణ, 69 సిజేరియన్, నవంబర్లో 60 సాధారణ, 61 సిజేరియన్ డెలివరీలు జరిగాయి.
కార్పోరేట్ సేవలు
మాతా శిశు సంరక్షణ కేంద్రం ద్వారా తల్లీ బిడ్డలకు వైద్య సేవలు అందుతుండగా మరో వైపు ఔట్ పేషెంట్ బ్లాక్లో ఆర్థో, జనరల్ సర్జన్, పీడియాట్రిక్ సేవలు అందుతున్నాయి. ఐదుగురు గైనకాలజిస్టులు, నలుగురు ఆర్థో, ముగ్గురు జనరల్ సర్జన్లు, నలుగురు అనస్థీషియా, ముగ్గురు పిల్లల వైద్యులు అందుబాటులో ఉన్నారు. పుట్టిన పిల్లల కోసం ఫొటో థెరపీ యంత్రాలను సిద్ధంగా ఉంచారు. అత్యాధునిక ఐసీయూ యూనిట్ను నెలకొల్పడంతో పాటు పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆక్సిజన్ ప్లాంట్ను నెలకొల్పారు.
నిర్మాణంలో డయాగ్నస్టిక్ హబ్
దవాఖాన ఆవరణలో రూ.1.25 కోట్లతో డయాగ్నస్టిక్ హబ్ను నిర్మిస్తుండగా త్వరలో పూర్తి కానుంది. ఇది పూర్తయితే అన్ని రకాల వైద్య పరీక్షలు ఇక్కడే అందుబాటులోకి రానున్నాయి. అలాగే రూ.16.60 లక్షలతో ఆర్టీపీసీఆర్ ల్యాబోరేటరీస్, రూ.54 లక్షలతో 20 పడకల పిల్లల ప్రత్యేక సంరక్షణ విభాగం, రూ. 3.65 లక్షలతో ఎన్సీడీ క్లినిక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. వీటన్నిటికీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అలాగే రూ.11 లక్షలతో ప్యాలియేటివ్ సేవా కేంద్రంను మంత్రి హరీశ్రావు ఇటీవల ప్రారంభించారు.
ప్రారంభమైన పోస్టుమార్టం విభాగం
జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం సేవలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు నాలుగు కేసులకు సంబంధించి పోస్టుమార్టం నిర్వహించారు. గతంలో ఈ ఏరియాలో ఎలాంటి మరణాలు సంభవించినా పోస్టుమార్టం కోసం పరకాలలోని సివిల్ దవాఖానకు తరలించేవారు. దీంతో పోస్టుమార్టం జాప్యంతో మృతుల బంధువులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం భూపాలపల్లిలో పోస్టుమార్టం సేవలు ప్రారంభం కావడంతో ఇబ్బందులు తప్పాయి.
సాధారణ ప్రసవాలే లక్ష్యం
సాధారణ ప్రసవాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గర్భిణుల కుటుంబ సభ్యులకు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్నాం. తప్పనిసని పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తున్నాం. వైద్యశాలలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. 108, 102 ఆంబులెన్స్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఎనిమిది నెలల్లో 807 ప్రసవాలు జరిగాయి. మరోవైపు ఔట్ పేషెంట్ బ్లాకులో ఆర్థో, జనరల్ సర్జన్, గైనకాలజిస్టు, పిడియాట్రిక్ సేవలు అందుబాటులోకి తెచ్చాం.
– ఆకుల సంజీవయ్య, సూపరింటెండెంట్
వైద్య సేవలు చాలా బాగున్నాయి..
భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్యసేవలు చాలా బాగున్నాయి. గర్భిణులకే కాకుండా ఔట్ పేషెంట్లకు సైతం కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతున్నది. అంతేకాకుండా ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించడం వల్ల పరకాలకు పోయే ఇబ్బంది తప్పింది.
– ఎ రాజవీరు, గొర్లవీడు