ఐనవోలు, ఏప్రిల్ 21 : వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ గెలుస్తున్నట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ముందుగా మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన మూడు నెలల్లో రాష్ట్రంలో వచ్చిన మార్పుతో ప్రజలు అనేక ఇబ్బందుల ఎదుర్కుకొంటున్నారన్నారు. ఒక్కసారి కేసీఆర్ను కాదు అనుకున్నందుకు ఈ ఇబ్బందులు వచ్చాయని, ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ వెంటనే ఉండాలని ప్రజానీకం నిర్ణయం తీసుకున్నట్లుగా గుర్తుజేశారు. ఏ సర్వే చూసినా బీఆర్ఎస్దే గెలుపు ఖాయమన్నారు. తెలంగాణ ఎదుగుదలను చూసి ఆంధ్రా గురువుకు శిష్యుడైన రేవంత్రెడ్డి, కేంద్రలో ఉన్న నాయకులు ఓర్వలేకపోయారన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు వస్త లేవు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇస్తామన్న పథకాలకు ఇంకా మొదలే కాలేదని విమర్శించారు. మోదీ దేశానికి ప్రధానమంత్రా.. లేక ఒక గుజరాత్ రాష్ర్టానికే అర్థం కావడం లేదన్నారు. దేశంలో ఏ కొత్త కంపెనీ, ప్రాజెక్టు, ఇంకా ఏదైనా కొత్తది వచ్చిందంటే పట్టుబట్టి గుజరాత్ రాష్ర్టానికి తరలించుకపోతున్నట్లుగా గుర్తుజేశారు.
ఐనవోలు ప్రజలు ముగ్గురు నాయకులపై కోపం గా ఉన్నారు.. ఇందులో ఒకరు కడియం శ్రీహరి, ఇంకొకరు అరూరి రమేశ్, మరొకరు మార్నేని రవీందర్రావుపై ప్రజలు కోపంగా ఉన్నారని, అవకాశమస్తే కసి తీరా ఓడించాలని ప్రజలు చూస్తున్నట్లుగా ఆయన వివరించారు. శ్రీహరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయే వలస పక్షిలాంటోడు. అరూరి రమేశ్ కన్న తల్లిపాలు తాగి రొమ్మును కుద్దిపోయే మనిషన్నారు. మార్నేని రవీందర్రావు అన్నం పెట్టిన పార్టీకే సున్నం పెట్టే నాయకుడని ఆయన ఎద్దేవా చేశారు. మీరు ఇతర పార్టీలకు వెళ్లిపోయా రు.. పోతేపొండి.. కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఫో న్లు చేసినా తమ పార్టీలోకి రండి.. అని పిలువడం బంద్ చేయాలి. మీరంటే ప్రజలు, కార్యకర్తలు, నాయకుల్లో నమ్మకం పోయిందన్నారు. అట్లాని తమ పార్టీలకు రావడం లేదని ఏదైనా ఇబ్బంది పెట్టి కేసు ల్లో ఇంకా ఏదైనా ఇబ్బందులు పెడితే పోలీసు స్టేషన్ ఎదుట కూర్చోని ధర్నా చేస్తానని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీలో తాను ఒక సామాన్య కార్యకర్తనని.. తన సేవలను గుర్తించి కేసీఆర్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని, అందుకే ఒక కార్యకర్తగా తన గెలుపు బీఆర్ఎస్ కార్యకర్తల గెలుపేనని ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తాగడానికి, పంటకు నీళ్లు, కరెంటు ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మన హక్కులు మనకు రావాలంటే కేంద్రంలో కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ ఉండాలని, పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్లో బీఆర్ఎస్ గెలువబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వాసుదేవరెడ్డి, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, హసన్పర్తి మండలాధ్యక్షుడు రజీని, జడ్పీ కోఆప్షన్ ఉస్మాన్ అలీ, వైస్ ఎంపీపీ మోహన్, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, మండల కో ఆప్షన్ గుంషావలి, మండల ఇన్చార్జి గోపాల్రావు, ఎంపీటీసీ కే రాజు, మాజీ సర్పంచ్లు సురేశ్, సదానందం, కే స్వామి, నాయకులు రాజు, రాఘవులు, సతీశ్, అశోక్, కుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.