నమస్తే నెట్వర్క్, ఆగస్టు 6 : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్పై అభిమానం వెల్లువెత్తింది. ఉమ్మడి జిల్లాలోని ఊరూరా ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ సంస్థలతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబురాలు నిర్వహించా రు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
హనుమకొండలోని ఏకశిల పార్కులోని సార్ విగ్రహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట క్రాస్ రోడ్డులో మాజీ ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్నారు. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, నెక్కొండలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రొఫెసర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి మరువలేనిదన్నారు. స్వరాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు కాగా, జనగామలో ప్రొఫెసర్ విగ్రహ ఏర్పాటుతోపాటు ప్రతిష్ఠాపనకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు స్థలాన్ని గుర్తించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు.
