‘తల్లికొడుకుల కథ ఇది. హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. టీజర్ విడుదలైన తర్వాత డైలాగ్స్ అర్థం కాలేదని కైంప్లెంట్స్ వచ్చాయి. అన్నీ కరెక్ట్గా చెబితే ఆ పాత్ర ఆత్మ పోతుంది. విప్లవం రగిలించిన నాయకుడు కనిపించడు. సినిమాలో మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డైలాగ్స్ స్పష్టంగా వినిపిస్తాయి. నా కెరీర్లోనే ఎక్కువ రోజులు కష్టపడిన సినిమా ఇది’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ‘ది ప్యారడైజ్’ చిత్రం ఈ నెల 24న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం చిత్రబృందం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నాని ఇంకా మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ట్రైలర్ లేదు. ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. సమయాభావం వల్ల ట్రైలర్ను అందించలేకపోతున్నాం. తప్పనిసరి పరిస్థితులో ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాల ఎంపిక విషయంలో నేనెప్పుడూ ట్రెండ్ను ఫాలో కాలేదు. నా సినీ ప్రయాణాన్ని చూస్తే మీకా విషయం అర్థమవుతుంది. ఇక దర్శకుడు శ్రీకాంత్ అద్భుతమైన విజన్తో ఈ సినిమా తీశాడు. అతను మంచితనం ఉన్న మొండివాడు.
అందరూ అనుకుంటున్నట్లుగా ఇది పాన్ ఇండియా సినిమా కాదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేస్తున్నాం’ అన్నారు. తన పాత్ర జడలు వేసుకొని, టాటూలు ధరించడం గురించి మాట్లాడుతూ ‘దర్శకుడు స్క్రిప్ట్ నరేషన్ సందర్భంలో ఈ విషయాలు చెప్పినప్పుడు నేనేమి ఫీల్ కాలేదు. ఎందుకంటే శ్రీకాంత్ సినిమా పిచ్చోడు. ప్రస్తుతం సోషల్మీడియా ప్రపంచంలో మనమంతా ఓ పరిధిలో ఉంటున్నాం. ఒక మనిషి అందరికీ నచ్చాలనే రూల్ ఏమీ లేదు’ అని తెలిపారు.
‘ఇది విప్లవం, భావోద్వేగాలు కలబోసిన సినిమా. మరుగున పడిన ఒక సవారీ జాతి కథ. దేశంకోసం కొట్లాడిన వారిని ఆ దేశంతోనే సంబంధం లేదంటే వారు ఎలాంటి పోరాటం చేశారన్నదే సినిమా కథ’ అని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలిపారు. టికెట్ ధరల పెంపు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి పేర్కొన్నారు.