తిమ్మాపూర్, సెప్టెంబర్ 11 : మానకొండూర్ నియోజకవర్గంలో రౌడీరాజ్యం నడుస్తున్నదని, ఎన్నికల హామీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి డైరెక్షన్లు ఇస్తూ దాడులు చేయిస్తున్నారని మాజీ ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం సర్పంచ్ తట్ల తిరుపతిపై గురువారం కాంగ్రెస్ గూండాలు దాడి చేయగా.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మండల నాయకులతో కలిసి శుక్రవారం నుస్తులాపూర్ నుంచి భారీ కార్లతో మొగిలిపాలెం వరకు ర్యాలీ తీసి, సర్పంచ్ను పరామర్శించారు.
రసమయి మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి వెళ్లిన సర్పంచ్ తిరుపతిపై కాంగ్రెస్ గూండాలు దాడికి దిగడం దురదృష్టకరమని మండిపడ్డారు. రైతులు యూరియా అడిగితే దాడు లు చేస్తావా అని సొసైటీ చైర్మన్ రమణారెడ్డిపై మండిపడ్డారు. రమణారెడ్డిని సొసైటీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో దళితుల గురించి మాట్లాడే కవ్వంపల్లి.. దళితుడిని అయిన తన దిష్టిబొమ్మను దహనం చేస్తున్నాడని అసహనం వ్యక్తంచేశారు.