పంట చేతికొచ్చే దశలో మాయదారి వర్షం రైతన్నను నిండా ముంచింది. వరుసగా కురుస్తున్న వానలతో వారి రెక్కల కష్టం తుడిచి పెట్టుకుపోయింది. ఆదివారం అర్ధరాత్రి హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులతో పంటలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల వరి, మక్కజొన్న నేలవాలాయి. మామిడికాయలు రాలిపోయాయి. కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట మొత్తం అకాల వర్షాలతో దెబ్బతిన్నదని రైతన్న ఆవేదన చెందుతున్నాడు. పెట్టుబడి కూడా వస్తుందో.. రాదోనని దిగాలు పడుతున్నాడు.
– నమస్తే నెట్వర్క్
వరుస వర్షాలు అన్నదాతల రెక్కల కష్టాన్ని తుడిచిపెట్టుకుపోతున్నాయి. వారం నుంచీ కురుస్తున్న చెడగొట్టు వానలతో ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీరని పంట నష్టం జరిగింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ అకాల వానకు చాలా చోట్ల కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవడమే కాకుండా పలు చోట్ల మొలకెత్తింది. చాలా ప్రాంతాల్లో వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. వడ్లు ఆరేలోపే మళ్లీ వాన పడుతుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం, మహదేవపూర్, చిట్యాల, మల్హర్ తదితర మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో 3.2 సెం. మీ వాన పడింది. ములుగు జిల్లాలో 2.5 సెం. మీ వర్షపాతం నమోదైంది.
మహబూబాబాద్ జిల్లాలో 4,868 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పది మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు, దంతాలపల్లి, కేసముద్రం, డోర్నకల్, బయ్యారం, గార్ల, పెద్దవంగర తదితర మండలాల్లో వర్షం కురిసింది. జనగామ జిల్లాలో తరిగొప్పుల, చిల్పూరు, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లో 749 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరంగల్ జిల్లాలో 5.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. నర్సంపేట, గీసుగొండ, వర్ధన్నపేట, రాయపర్తి తదితర మండలాల్లో కురిసిన వర్షంతో అన్నదాతలు అవస్థలు పడ్డారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, హసన్పర్తి, ధర్మసాగర్, శాయంపేట, పరకాల మండలాల్లో వర్షం దంచికొట్టింది. ధర్మసాగర్ మండలంలో అత్యధికంగా 7.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీటిపాలై రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా పంట నష్టంపై రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు భరోసా కల్పిస్తున్నారు. పంటనష్టంపై సమీక్షలు నిర్వహించి అధికారయంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు.