ఖిలా వరంగల్, జనవరి 22 : ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు అంకితభావంతో పని చేయాలని, పనితీరు సరిగా లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్కు మంత్రి మొదటిసారి రావడంతో కలెక్టర్, అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గ్రీవెన్స్లో మంత్రి అధికారులతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులతో పాటు హైదరాబాద్ ప్రజా భవన్లో వరంగల్ జిల్లాకు సంబంధించిన రెండు విడుతల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిషరించాలని సూచించారు.
ప్రజాపాలన దరఖాస్తులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఒకే సమస్యపై దరఖాస్తుదారులు పలుమార్లు గ్రీవెన్స్కు రాకుండా పరిష్కారం చూపాలన్నారు. అలాగే దరఖాస్తు స్టేటస్ను ఎప్పటికప్పుడు లబ్ధిదారుడికి తెలిసేలా త్వరలో చర్యలు చేపడుతామన్నారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్లో అధికారులు తీరు మార్చుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు. జిల్లాలో 55 వినతులు స్వీకరించామన్నారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, జడ్పీ సీఈవో రామ్రెడ్డి, డీఆర్డీవో పీడీ సంపత్రావు పాల్గొన్నారు.