పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో తెలంగాణలో 486 నమూనాల్లో నిర్దేశిత గరిష్ఠ అవశేష పరిమితి (ఎంఆర్ఎల్)కి మించి అవశేషాలు ఉన్నట్లు తేలింది. 2023-26 మధ్య దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 70,652 పండ్లు, కూరగాయల నమూనాలను పరీక్షించగా.. 2,223 (3.1 శాతం) నమూనాల్లో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్దేశించిన ఎంఆర్ఎల్ కంటే అధికంగా పురుగుమందుల అవశేషాలు గుర్తించినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ మంగళవారం రాతపూర్వకంగా లోక్సభలో వెల్లడించారు.
కేంద్ర వ్యవసాయశాఖ అమలు చేస్తున్న ‘మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎట్ నేషనల్ లెవల్’ (ఎంఆర్పీఎన్ఎల్) ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో మొత్తం 8,198 నమూనాలను విశ్లేషించగా.. 486 నమూనాల్లో ఎంఆర్ఎల్ కంటే అధికంగా పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా కర్ణాటకలో 9,176 నమూనాలను పరీక్షించగా 334లో అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. మహారాష్ట్రలో 5,295 నమూనాలకు 260, గుజరాత్లో 6,035 నమూనాలకు 170, హరియాణాలో 2,371 నమూనాలకు 152, ఆంధ్రప్రదేశ్లో 2,104 నమూనాలకు 134 చొప్పున అధిక అవశేషాలు నమోదయ్యాయి.
ఎంఆర్పీఎన్ఎల్ ప్రాజెక్టు కింద రిటైల్ దుకాణాలు, టోకు మార్కెట్లు, సహకార సంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) మార్కెట్లు, రైతుల పొలాల వద్ద, సేంద్రియ ఉత్పత్తుల విక్రయ కేంద్రాల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 40 ప్రయోగశాలలు వీటిని పరీక్షిస్తున్నాయి. నమూనా సేకరించిన ప్రదేశానికి సంబంధించిన జీపీఎస్ వివరాలను నమోదు చేస్తున్నారు. రైతు పొలం వద్ద సేకరించిన నమూనాలైతే సాగు ప్రాంతాన్ని గుర్తించేలా ట్రేసబిలిటీని ఏర్పాటు చేశారు.
రైతులు పురుగుమందులను విచక్షణారహితంగా వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. 48 కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రాల ద్వారా రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 2021-22 నుంచి 2025-26 వరకు 1,353 రైతు క్షేత్ర పాఠశాలలు నిర్వహించి 46,969 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. 680 రెండు రోజుల శిక్షణ కార్యక్రమాల ద్వారా 37,664 మంది, 2,384 సురక్షిత, సముచిత పురుగుమందుల వినియోగ అవగాహన కార్యక్రమాల ద్వారా 76,702 మంది రైతులు లబ్ధి పొందారు. అలాగే 2,548 విత్తన శుద్ధి కార్యక్రమాల ద్వారా 81,048 మందికి అవగాహన కల్పించారు.
కేంద్రం ఇటీవల నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ (ఎన్పీఎస్ఎస్)ను అందుబాటులోకి తెచ్చింది. కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా పురుగు తెగుళ్లను గుర్తించడం, పర్యవేక్షించడం, నిపుణుల సలహాలు పొందడం సాధ్యమవుతుంది. సమగ్ర సస్యరక్షణలో భాగంగా బయో కంట్రోల్ ఏజెంట్లు, బయో పెస్టిసైడ్ల వినియోగానికి ప్రాధాన్యమిస్తూ.. అవసరమైనప్పుడు మాత్రమే అనుమతించిన పురుగుమందులను సూచించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.
పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణ ప్రాజెక్టును 2028-29 వరకు కొనసాగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 21 రాష్ట్రాలు పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణ, మంచి వ్యవసాయ పద్ధతులు (జీఏపీ), సమగ్ర సస్యరక్షణ అమలుకు రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేశాయి. ఆహార ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించిన పరిమితులను మించితే.. ఆహారం సురక్షితం కానిదిగా పరిగణిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.