న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో నిర్మాణంలో ఉన్న టన్నెల్(Uttarakhand Tunnel)లో ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా టన్నెల్లోకి నీరు, బురుద ప్రవేశించడంతో ఏడుగురు మృతిచెందారు. పలువురు ఆ శిథిలాల్లో చిక్కుకున్నారు. చమోలీ జిల్లాలోని పిపల్కోట్లో ఉన్న తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు చెందిన టన్నెల్లో ఈ ఘటన జరిగింది. టీహెచ్డీసీ టన్నెల్ నుంచి సుమారు 19 మందిని బయటకు తీసుకువచ్చారు. దీంట్లో ఏడు మంది మృతిచెందినట్లు ద్రువీకరించారు. 13 మంది పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నది. కొందర్ని శ్రీనగర్లోని బేస్ ఆస్పత్రికి తరలించారు.
టన్నెల్లో చిక్కుకున్న మిగితా కార్మికుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టడీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టాయి. టన్నెల్లోకి భారీ స్థాయిలో నీరు ప్రవేశించిందని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కమాండర్ అమృత్ లాల్ మీనా తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన తర్వాత టన్నెల్లో భారీగా నీరు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రత్యేక ఎక్విప్మెంట్ సహకారంతో మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్లో సుమారు 22 మంది ఉండి ఉంటారని టీహెచ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ శరద్ తెలిపారు.