రాయపర్తి, అక్టోబర్ 5 : గిరిజన తండాలన్నింటిని పట్టణాలకు దీటుగా సమగ్రాభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా రూ.కోట్ల నిధులతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. తండా బాట కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని గిరిజన గ్రామ పంచాయతీలు అయిన అవుసులకుంట తండ, సూర్యాతండ, బాలాజీ తండ, బాలునాయక్ తండా, జయరాంతండ(ఎస్), దుబ్బతండా, పానీష్తండాలో వరంగల్ అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాఖడేతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా తండాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, భూమిపూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సర్పంచ్ల అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజన తండాల తలరాతలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి పాలకులు, రాజకీయ పార్టీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే చూశాయన్నారు. గత పాలకులు చూపిన వివక్ష కారణంగానే గిరిజనులంతా అటవీ ప్రాంతాలు, గ్రామాలకు దూరంగా వ్యవసాయ క్షేత్రాల్లో స్థిర నివాసాలను ఏర్పరచుకుని జీవనాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వేలాది జనాభా ఉన్న గిరిజన తండాలన్నీ గ్రామాలకు ఆవాసా ప్రాంతాలుగా ఉన్నాయే తప్ప ఏనాడు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు కాలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనా పోరాటంలో సుధీర్ఘ కాలంపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజల అవసరాలు, ఆకాంక్షలను గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి వారి ఆత్మ గౌరవాలను రెట్టింపు చేశారన్నారు. మా తండాల్లో మా రాజ్యం అన్న నినాదాన్ని నిజం చేసి చూపించిన సీఎం కేసీఆర్కు మండలంలోని అన్ని గ్రామాల గిరిజనులంతా రుణపడి ఉంటారన్నారు. భవిష్యత్తులోనూ గిరిజన తండాలు, గూడాలు బీఆర్ఎస్కు తమ సంపూర్ణ మద్దతును తెలుపాలని కోరారు. అనంతరం తండాలలోని గిరిజనులతో ఆయన నేరుగా మాట్లాడుతూ సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. విడుతల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
పీసీసీ ఛీఫ్ రేవంత్రెడ్డి రాష్ట్రంలోని ఆదివాసీలు, గిరిజనుల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎస్టీల వర్గీకరణల పేరుతో కుట్రలకు తెర తీస్తున్నాడని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఏనాడు పెదవి విప్పని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మాయ మాటలు చెబుతూ ఓట్లు దండుకునేందుకు వస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందజేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి తాము అధికారంలో రాగానే వ్యవసాయ రంగానికి కేవలం మూడు గంటల కరెంట్ సరఫరా చేస్తామని చెబుతున్నారన్నారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించేందుకు వస్తున్న ప్రతిపక్ష పార్టీలను ప్రజలు పాతర పెట్టాలని కోరారు.
మండలంలోని తండాల్లో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆర్థికసాయంతో మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఉచితంగా లంచ్ బాక్స్, స్టీల్ వాటర్ బాటిల్, బ్యాగులను మంత్రి అందజేశారు. కాగా, దుబ్బతండాలో సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి మంత్రి పర్యటించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల ఎన్నికల ఇన్చార్జి గుడిపూడి గోపాల్రావు, పార్టీ అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, జడ్పీటీసీ రంగు కుమార్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, నాయకులు పూస మధు, కుందూరు రాంచంద్రారెడ్డి, జక్కుల వెంకట్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు మూడు రంగమ్మ, మునావత్ అమ్మి మాంజ్యానాయక్, మునావత్ వెంకన్న, బానోత్ కౌసల్య హనుమానాయక్, బానోత్ జగన్నాయక్, బానోత్ పద్మా రవినాయక్, దేదావత్ కమలమ్మ వెంకన్న, బానోత్ భద్రునాయక్, తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏవో గుమ్మడి వీరభద్రం, పంచాయతీరాజ్ డీఈ వాసం బాబూరావు, ఏఈలు శేషం కిరణ్కుమార్, శ్రీప్రియ, ఆర్డబ్ల్యూఎస్ డీఈ వేణు, ఏఈలు అనూష, శివప్రసాద్, పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఎనగందుల యాకనారాయణ, గారె నర్సయ్య, లేతాకుల యాదవరెడ్డి, గుగులోతు జాజునాయక్, చెవ్వ కాశీనాథం, చిన్నాల రాజబాబు, భాషబోయిన సుధాకర్, పెదగాని సంతోష్కుమార్, గూడెల్లి శ్రీనివాస్, అనంతుల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలను గల్లంతు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం హనుమకొండలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బూడిద వెంకన్న, రాంపెల్లి శ్రీను, మహ్మద్ సలీం, గుండ్లపల్లి యాకాంత, బూడిద రఘుపతి, ప్రజాపతి, గాదె రాజు, పెర్కవేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు దొనగాని అశోక్కుమార్, ముంజ యాకయ్య, బీజేపీ నాయకులు కూన యాదగిరి తదితరులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి ఎర్రబెల్లి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరుతున్న కార్యకర్తలు, నాయకులందరికి భవిష్యత్లో సముచిత స్థానం ఉంటుందన్నారు. అన్ని వేళల్లో కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు చిన్నాల తారాశ్రీ రాజబాబు, బోనగిరి ఎల్లయ్య, ఎంపీటీసీ బండి అనూషా రాజబాబు, గ్రామ పార్టీల అధ్యక్షులు బొమ్మెర వీరస్వామి, మండల శ్రీధర్, మాకినేని పెద్ద కృష్ణారావు, మంగిశెట్టి రాజు, ఆకుల సమ్మయ్య, కుల్లా వెంకన్న, భాషబోయిన సుధాకర్, వేముల రమేశ్, ఉండాడి సతీశ్కుమార్, మహ్మద్ గుంషావలి, రాంపెల్లి రాజాలు, భూడిద శ్రీధర్, రాజేందర్, అనిల్, సోమయ్య, సిరికొండ వెంకన్న, గాదరి వెంకన్న, యాకయ్య, సురేందర్ పాల్గొన్నారు.