రాయపర్తి, జూన్ 7: సీమాంధ్రుల పరిపాలనలో తెలంగాణ ప్రాంతంలోని బోర్లు, బావులు, చెరువులు, కుంటలన్నీ వట్టిపోయి భూగర్భంలోకి వెళ్లిపోయిన గంగమ్మతల్లిని నేడు భూపొరలన్నింటినీ తన్నుకుంటూ పైకి ఉబికి వచ్చేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మండలంలోని కిష్టాపురం క్రాస్రోడ్డులో ఉన్న వీఆర్గార్డెన్స్లో బుధవారం పాలకుర్తి నియోజకవర్గస్థాయిలో సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ ఏస్ఈ ఆర్ సుధీర్కుమార్ అధ్యక్షతన జరిగిన వేడుకలకు కలెక్టర్ పీ ప్రావీణ్యతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్లలో ఇరిగేషన్ రంగంలో సాధించిన ప్రగతి, వ్యవసాయ రంగానికి అందిస్తున్న అద్భుత అవకాశాలను ఆడియోలు, వీడియోల రూపంలో ప్రదర్శించి సభికులకు వివరించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ పదేళ్ల క్రితం వరకు తెలంగాణ ప్రాంతం అంటే చిల్లులు పడిన భూభాగమన్నారు.
పంటల సాగు కోసం రైతన్నలు తమ భార్య మెడల్లోని పుస్తెలమ్మి గుక్కెడు నీళ్ల కోసం బోర్లు వేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అయినా నీళ్లు పడకపోవడంతో అప్పులపాలయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర పాలకుల ఆదరణ లేకపోవడంతో తెలంగాణ ప్రాంతం లో వ్యవసాయ రంగానికి ఆశించిన స్థాయిలో విద్యుత్ సరఫరా కాలేదని, సాగు జలాలు రాకపోవడంతో అన్నదాతలు తమ విలువైన భూములన్నింటినీ పడావు పెట్టుకుని పొట్టకూటి కోసం పట్నాలకు కట్టుబట్టలతో వలసలు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవుసం పడావు పడడంతో భూముల్లో పల్లేర్లు మొలిచాయన్నారు. కానీ, నేడు సీఎం కేసీఆర్ భగీరథుడి వలె అహోరాత్రులు కష్టించి పని చేయడంతో గంగమ్మతల్లి తెలంగాణలోని భూభాగమంతటినీ తడుముతూ ముందుకు సాగుతుండడంతో ఆనాడు పల్లేర్లు మొలిచిన భూ ముళల్ల నేడు పసిడి పంటలు పండుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజలు అండగా నిలువాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు గ్రామాలకు వస్తున్నారని, వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలో జరుగుతున్న దేవాదుల ప్రాజెక్ట్ కాల్వల నిర్మాణం, తవ్వకం పనుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. పలు మండలాల్లోని భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను మంత్రి ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం సాగునీటి రంగంలో పదేళ్ల కాలంలో సాధించిన ప్రగతిపై ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలను ఎర్రబెల్లి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్రావు, ఇరిగేషన్ ఈఈ ఆర్ రమేశ్బాబు, ఈఈ కె.ప్రవీణ్కుమార్, డీఈఈ పి.కిరణ్కుమార్, పూర్ణచందర్, జె.సునీల్కుమార్, సౌజన్య, శ్రీకాంత్, ఏఈఈ బి.బాలదాస్, నందకిశోర్, శ్రీనివాసరావు, లక్ష్మి, స్వాతిరెడ్డి, నవ్య, ఏఈ శశిధర్రెడ్డి, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.