నర్సంపేట, జూలై 1: నర్సంపేటలో మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పట్టణంలో రూ. 1.25 కోట్లతో నిర్మించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ను శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సంపేటకు మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరగా, ప్రతిపాదన ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో మరో ఎనిమిది కళాశాలలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. నర్సంపేటలో నిర్మించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. డయాగ్నొస్టిక్ హబ్లో 134 రకాల వైద్య పరీక్షలు చేస్తారన్నారు. పీహెచ్సీలు, పల్లెదవాఖానల్లో రోగుల నుంచి వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించి ప్రత్యేక వాహనంలో డయాగ్నొస్టిక్ హబ్కు తరలించి పరీక్షలు చేస్తారన్నారు. వచ్చిన ఫలితాలను ఆన్లైన్లో ఆయా దవాఖానలతోపాటు బాధిత వ్యక్తుల సెల్ఫోన్లకు పంపుతారని వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సహకారంతో నర్సంపేట నియోజకవర్గాన్ని హెల్త్హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. నర్సంపేటలో ఇప్పటికే రూ. 70 కోట్లతో 250 పడకల జిల్లాస్థాయి దవాఖానను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ. 30 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ను మంజూరు చేశారన్నారు. రూ. 6 కోట్లతో 49 పల్లె దవాఖానలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నర్సంపేట పట్టణంలో బస్తీ దవాఖానను ప్రారంభించామన్నారు. నర్సంపేటలోని ఏరియా దవాఖానలో కొత్త పరికరాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. పట్టణంలో ఇప్పటికే బ్లడ్బ్యాంక్, డయాలసిస్ సెంటర్ను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. అన్ని రకాల వైద్యులను అందుబాటులోకి తెచ్చామన్నారు. పట్టణంలో జిల్లాస్థాయి దవాఖాన ఏర్పాటు వల్ల మారుమూల ప్రాంతాలకు అన్ని రకాల వైద్యులు అందుబాటులోకి వస్తారన్నారు. వైద్యపరంగా నర్సంపేటను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నదన్నారు. టీ డయాగ్నొస్టిక్ హబ్ సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, ఆర్డీవో శ్రీనివాసులు, సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్, డీఎంహెచ్వో వెంకటరమణ, కౌన్సిలర్ రుద్ర మల్లేశ్వరి, రాయిడి రవీందర్రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, గంప రాజేశ్వర్గౌడ్, ఎంపీపీలు కాట్ల కోమల, వీ ప్రకాశ్రావు పాల్గొన్నారు.