వరంగల్, డిసెంబర్ 1(నమస్తేతెలంగాణ) : జిల్లాలో గతంలో మాదిరిగానే గ్రామీణ ఓటర్లు పోలింగ్పై ఆసక్తి కనబరచగా పట్టణ ఓటర్లు నిరాసక్తత చూపారు. దీంతో గ్రా మీణ ప్రాంతాల్లోని అనేక పోలింగ్ కేంద్రాల్లో తొంబై శాతానికిపైగా పోలింగ్ జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో రికార్డు స్థాయిలో 96.20 శాతం పో లింగ్ నమోదైంది. నర్సంపేట నియోజకవర్గంలో 87.87, వర్ధన్నపేటలో 80.23, వరంగల్తూర్పులో 66.74 శాతం పోలింగ్ నమోదైనట్లు శుక్రవారం ఎన్నికల అధికారులు వెల్లడించారు. నర్సంపేట నియోజకవర్గంలో 2,04,011 మంది ఓటు వేశారు. వర్ధన్నపేటలో 2,15,986 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తూర్పులో 1,69,935 మంది ఓటు వేశారు. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని కోనాపురం నంబర్వన్ స్థానంలో నిలిచింది. చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామంలోని 196వ పోలింగ్ కేంద్రంలో 96.20 శాతం పోలింగ్ జరిగింది. ఈ కేంద్రంలో మొత్తం 552 మంది ఉంటే 531 మంది ఓటు వేశారు. అలాగే 195వ కేంద్రంలో 93.99 శాతం పోలింగ్ నమోదైంది. 716 మంది ఓటర్లలో 673 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్లబెల్లి మండలంలోని బుచ్చిరెడ్డిపల్లె గ్రామం పోలింగ్ నమోదులో రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ 96.19 శాతం పోలింగ్ నమోదైంది. 57వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 499 మంది ఓటర్లు ఉంటే 480 మంది ఓటు వేశారు. దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామంలోని 15వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 94.84, చెన్నారావుపేట మండలం అక్కలచెడలోని 197వ కేంద్రంలో 94.82, దుగ్గొండి మండలం రేఖంపల్లిలోని 35వ కేంద్రంలో 93.89, ఖానాపురం మండలం రాగంపేటలోని 100వ పోలింగ్ కేంద్రంలో 93.89, నెక్కొండ మండలం చంద్రుగొండలోని 241 పోలింగ్ కేంద్రంలో 93.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
పోలింగ్ నమోదులో వర్ధన్నపేట నియోజకవర్గంలో అమ్మవారిపేట గ్రామం అగ్రభాగాన నిలిచింది. ఇక్కడి 150వ పోలింగ్ కేంద్రంలో రికార్డు స్థాయిలో 95.60 శాతం పోలింగ్ నమోదైంది. ఈ కేంద్రంలో 318 మంది ఓటర్లలో 304 మంది ఓటు వేశారు. పర్వతగిరి మండలంలోని జమాల్పూర్ గ్రామం రెండోస్థానంలో ఉంది. ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన 259వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 582 మంది ఓటర్లకు 550 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత స్థానంలో కుమ్మరివాడ ఉంది. ఇక్కడి 227వ పోలింగ్ కేంద్రంలో 94.32 శాతం పోలింగ్ నమోదైంది. హెచ్సీతండాలోని 18వ కేంద్రంలో 93.93, ఐనవోలు మండల కేంద్రంలోని 167వ కేం ద్రంలో 92.72, పర్వతగిరి మండలం రావూరులోని 272వ పోలింగ్ కేం ద్రంలో 92.81, నక్కలపల్లిలోని 159వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 91.55, పెరుమండ్లగూడెంలోని 176వ కేంద్రంలో 91.59 శాతం పోలింగ్ నమోదైంది.
తూర్పు నియోజకవర్గంలో ఖిలావరంగల్ ప్రాంతం టాప్లో ఉంది. ఎల్బీనగర్లోని 91వ పోలింగ్ కేంద్రంలో 81.93 శాతం పోలింగ్ జరిగింది. 570 మంది ఓటర్లు ఉంటే 467 మంది ఓటు వేశారు. ఆ తర్వాత స్థానంలో ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 222వ పోలింగ్ కేంద్రంలో 81.88 శాతం పోలింగ్ జరిగింది. 1308 మంది ఓటర్లలో 1071 మంది ఓటు వేశారు. ఈస్ట్కోటలోని 224వ కేంద్రంలో 81.38 శాతం పోలింగ్ నమోదైంది. 1160 మంది ఓటర్లలో 944 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత 228వ పోలింగ్ కేంద్రంలో 81.88 శాతం పోలింగ్ నమోదైంది. 977 మంది ఓటర్లలో 800 మంది ఓటు వేశారు. 230వ కేంద్రంలో 81.27 శాతం పోలింగ్ జరిగింది. 1100 మంది ఓటర్లలో 894 మంది ఓటు వేశారు. 218వ కేంద్రంలో 80.87 శాతం పోలింగ్ నమోదైంది.