జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముస్లింల అభ్యున్నతికి చేసిందేమీ లేదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ముస్లిం, మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహమూద్ అలీ, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బస్వరాజ్ సారయ్య హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ ముస్లింలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ముస్లింలు అంటే ఓల్డ్ సిటీ అని, అల్లర్ల కేరాఫ్ అని ముద్ర వేశారన్నారు. వారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పనిచేసిన రేవంత్రెడ్డి టీడీపీలో చేరి, అనంతరం కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పాటిస్తున్న రేవంత్రెడ్డి ముస్లింల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తాడని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ముస్లిం, మైనార్టీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
204 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశారన్నారు. ఇప్పుడు డిగ్రీ కళాశాలలుగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. మైనార్టీ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు వైద్య విద్య, ఇంజినీరింగ్ అభ్యసిస్తున్నారన్నారు. ముస్లిం, మైనార్టీల విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.20లక్షలు అందిస్తున్నారని, దీంతో ఎంతో మంది మైనార్టీ బిడ్డలు విదేశాల్లో చదువుతున్నారన్నారు. రంజాన్ కానుకగా దుస్తులు, షాదీ ముబారక్కు రూ.లక్షా16వేలు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ కలిసిన ప్రతిసారి మైనార్టీలకు నిధుల కొరత ఉందా ? ఏమైనా సమస్యలున్నాయా ? మరిన్ని నిధులు కేటాయించాలా ? అని తనను అడుగుతుంటారని గుర్తు చేశారు. ముస్లింల ప్రార్థన మందిరాలకు ప్రత్యేక నిధులు కేటాయించారని, ఇమామ్లకు గౌరవ వేతనం ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఎన్నికలు రాగానే మన జాతిని దెబ్బతీసే విషపూరిత మాటలతో రెచ్చగొట్టే పార్టీలు వస్తుంటాయని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు. భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని గెలిపించుకోవాలని, కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా చూడాలన్నారు. మన కోసం ఇంతగా ఆరాటపడే బీఆర్ఎస్ను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో 15వేల మం ది ముస్లిం, మైనార్టీ ఓటర్లు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కేసీఆర్ మీకు అండగా ఉంటాడన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ ఇర్ఫాన్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు రహీం, యాకూబ్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు కాసీం ఆలీ, మాజీ ఎంపీపీ గులాం అఫ్జల్, ముస్లిం, మైనార్టీ నేతలు సాదిక్, కరీం, అన్వర్, ముస్లిం, మైనార్టీలు పాల్గొన్నారు.
ముస్లిం, మైనార్టీల కుటుంబాల్లో సోదరుడిగా వారికి సేవలందించానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలో ఈద్గా నిర్మాణం చేశామన్నారు. మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించిన విషయం గుర్తు చేశారు. షాదీఖాన నిర్మాణం కోసం రూ.70లక్షల నిధులు కేటాయించామన్నారు. రానున్న రోజుల్లో నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయిస్తానన్నారు. నియోజకవర్గ పరిధిలో ముస్లింలు ఈద్గాలు, కబరస్తాన్లకు నిధులు కావాలని అడిగిన వెంటనే కేటాయించానని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ముస్లింలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ముస్లింలు బీఆర్ఎస్తోనే ఆత్మగౌరవంతో ఉంటున్నారన్నారు.