కొండాపూర్, ఆగస్టు 14 : శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖాన అంధకారంతో నిండుకుంది. వారం రోజులుగా కరెంట్ లేకపోవడంతో దవాఖానలో చేరిన బాధితుల ఆక్రందనలకు నిలయంగా మారింది. కేసీఆర్ హయాంలో ప్రైవేట్ దవాఖానలకు దీటుగా రూపుదిద్దుకున్న ప్రభుత్వ దవాఖానలు.. నేడు రేవంత్రెడ్డి పాలనలో కరెంట్ లేక అంధకారంలోకి జారుకుంటున్నాయి.
వారం రోజులుగా దవఖానను తీవ్ర విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. ఆస్పత్రిలోని అత్యవసర విభాగాలు, ప్రసవ వార్డుల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో గర్భిణులు, ప్రాణాంతక స్థితిలో ఉన్న రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్యాధికారులు, సిబ్బంది ప్రసవాలు చేయడానికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి చికిత్స అందించడానికి సెల్ఫోన్ ఫ్లాష్ లైట్లు, టార్చ్ లైట్లను వినియోగిస్తుండటం ఇకడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
విద్యుత్ సమస్యతో పాటు ఆస్పత్రిలో పారిశుధ్యం పడకేసింది. కనీసం మరుగుదొడ్ల సౌకర్యం లేక రోగులు, వారి బంధువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రాంగణమంతా చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. పారిశుధ్య వైఫల్యం కారణంగా నవజాత శిశువులు, బలహీనంగా ఉన్న రోగులు కొత్త రోగాల బారిన పడే ప్రమాదం నెలకొంది.
ప్రజలు, రోగుల నుంచి వచ్చిన వరుస ఫిర్యాదులతో స్పందించిన కొండాపూర్ బీఆర్ఎస్ నాయకులు.. మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్, నవతారెడ్డి, రవి యాదవ్, నరేందర్ యాదవ్, మమత, మల్లారెడ్డి, విజయ్ భాస్కర్రెడ్డి అర్ధరాత్రి వేళ దవఖానను సందర్శించి, బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక జిల్లాస్థాయి ఆస్పత్రిలో ఇంతటి దారుణ పరిస్థితులు ఉండటం సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఆస్పత్రి అధికారులు, ప్రభుత్వం నవజాత శిశువులు, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో తక్షణమే నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ సౌకర్యం, నీటి వసతి, పారిశుధ్యాన్ని పునరుద్ధరించాలి.
గత 4 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఒక బాధితుడు మాట్లాడుతూ.. జగద్గిరిగుట్ట బస్తీ దవాఖానా నుంచి కొండాపూర్ ఆస్పత్రికి పంపారని తెలిపారు. అత్యవసరంగా రక్త పరీక్షలు రాస్తే, ల్యాబ్లో గత 4 రోజులుగా కరెంట్ లేకపోవడంతో పరీక్షలు చేయడం లేదని సిబ్బంది రేపటికి వాయిదా వేశారు. మంచినీళ్ల సౌకర్యం కూడా లేకపోవడంతో కేవలం పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటూ అల్లాడిపోతున్నానని వాపోయారు.
దవఖానలో వారం రోజులుగా విద్యుత్ లేకపోవడంతో మోటార్లు నడవక నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. బకెట్లలో నీటిని నింపి, ఆ బకెట్లను స్ట్రెచర్లపై పెట్టుకుని మోసుకెళ్లాల్సిన పరిస్థితి దవఖాన సిబ్బందికి దాపురించింది. గత ప్రభుత్వ హయాంలో దవఖాన రూపురేఖలను పూర్తిగా మార్చిన ఘనత కేసీఆర్కు దక్కితే.. అదే దవఖానను మరో పాతికేండ్లు వెనక్కి తీసుకెళ్లిన ఘనత ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డికి దక్కుతుందని దవఖానలో చికిత్స పొందుతున్న రోగులు పేర్కొంటున్నారు.