Hadnoor Police Station | జహీరాబాద్, సెప్టెంబర్ 19 : ప్రేమ వ్యవహారంలో కౌన్సెలింగ్ ఇస్తుండగా ఓ ఇంటర్ విద్యార్థిని పోలీస్స్టేషన్లోనే ఆత్మహత్యకు యత్నించింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్లో ఈ ఘటన కలకలం రేపింది. విద్యార్థిని పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించి ఆమెను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కోసం హద్నూర్కు వచ్చిన ఓ కుటుంబం గ్రామ శివారులోని ఫామ్హౌస్లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆ కుటుంబానికి నలుగురు సంతానం. పెద్ద కుమార్తె (17) హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వారం రోజుల క్రితం ఇద్దరూ కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఈ నెల 15న హద్నూర్ పోలీసులను ఆశ్రయించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టి విద్యార్థినితోపాటు యువకుడిని గుర్తించారు. అనంతరం ఇద్దరినీ హద్నూర్ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. ఇరు కుటుంబాల సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. విద్యార్థిని మైనర్ కావడంతో ప్రస్తుతం వివాహం సాధ్యం కాదని, చదువుపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచించారు. తల్లిదండ్రులు కూడా ఆమెకు నచ్చజెప్పారు.
కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకుని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
విద్యార్థిని మైనర్ కావడంతో పాటు ఎస్టీ వర్గానికి చెందినదని పేర్కొంటున్న నేపథ్యంలో యువకుడిపై వర్తించే చట్టాల ప్రకారం కేసు నమోదు చేసే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. కిడ్నాప్, పోక్సో చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.