కాంగ్రెస్ పాలనలో భూ రికార్డుల నిర్వహణలో దళారుల పెత్తనమే కొనసాగింది. రైతులకు తెలియకుండానే వారి పేర రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వ్యవసాయ భూమి మరొకరి పేరు మీదకు మారేది. బాధిత రైతులు నెత్తీనోరు బాదుకున్నా ఫలితం ఉండకపోయేది. ఉద్దేశపూర్వకంగా జరిగినవి కావడంతో చేసేది లేక అసలైనవారు నరకయాతన పడాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణి విప్లవాత్మక మార్పులు తెచ్చింది. భూ సమస్యలకు ఫుల్స్టాప్ పెట్టి అన్నదాతలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. కొందరు కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వస్తే ధరణిని ఎత్తేస్తామని ప్రకటనలు చేయడం అన్నదాతల్లో ఆగ్రహం తెప్పిస్తున్నది. పైసా ఖర్చులేకుండా సులభంగా, పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు అవుతుంటే వాళ్లకు కండ్లమంటగా ఉందని రైతాంగం మండిపడుతున్నది.
– వరంగల్, జూన్1 (నమస్తే తెలంగాణ)
వరంగల్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ధరణి పోర్టల్ వచ్చాక వ్యవసాయ భూముల లెక్కలు పక్కాగా రికార్డుల్లోకి ఎక్కాయి. ఏండ్ల నాటి సమస్యలకు పరిష్కారం చూపింది. భూమి రక్షణపై భరోసా కల్పించింది. సులభంగా, వేగంగా, పారదర్శకంగా సేవలందిస్తున్నది. ఏకకాలంలో తమ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్ జరిగిపోతుండటంతో రైతులు మురిసిపోతున్నారు. మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా పోయింది. దళారులకు ముడుపులు సమర్పించుకోవడం తప్పిందని సం బురపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. వారికి తెలియకుండానే రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వ్యవసాయ భూమి మరొకరి పేరుపై ఫోర్జరీ సంతకాలు, ట్యాంపరింగ్తో జరిగేది. రెవెన్యూ రికార్డుల్లోనే కాకుండా కంప్యూటరీకరణ సమయంలోనూ భూ యజమానుల పేర్లు మారాయి.
ఈ సమస్యలకు తోడు తాము కొనుగోలు చేసిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సైతం అరిగోస పడ్డారు. దళారులను ఆశ్రయించి డాక్యుమెంట్లు అన్నీ అందజేసిన కొద్ది రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ జరిగేది. ముడుపులు ముట్టిన తర్వాతే రైతుల చేతికి డాక్యుమెంట్లు అందేవి. వీటిని తీసుకెళ్లి మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే మ్యుటేషన్ కావడానికి నెలల గడువు పట్టేది. ఇదంతా ఒక ఎత్తయితే పట్టాదారు పాసు పుస్తకాలు చేతికందడానికీ రైతులు దళారులు అడిగిన డబ్బు సమర్పించుకోవాల్సి వచ్చేది. పట్టా పాస్బుక్ అందేలోగా భూమిని అమ్మిన వారు తిరిగి ఇతరులకు విక్రయిస్తే సమస్యలు ఉత్పన్నమయ్యేవి. సదరు భూమిని మొదట కొనుగోలు చేసిన రైతులు కార్యాలయాల చుట్టూ అనేకసార్లు తిరగాల్సి వచ్చేది. అయినా న్యాయం జరిగేది కాదు. చివరకు కొనుగోలు చేసిన భూమిని కోల్పోయిన బాధితులెందరో ఉన్నారు.
ధరణితో సమస్యలకు చెక్
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో భూ సమస్యలకు ఫుల్స్టాప్ పడింది. అక్రమాలకు తెరదించింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తహసీల్లోనే జరుగుతుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్ కోసం రైతులు తమకు వీలైన సమయంలో స్లాట్ బుక్ చేసుకొని కేటాయించిన సమయానికి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి డాక్యుమెంట్లు ఇచ్చి అరగంటలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. ఏకకాలంలో అదేరోజు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్ పూర్తవుతోంది. పట్టాదారు పాసుపుస్తకం రిజిస్టర్ పోస్టు ద్వారా నేరుగా రైతు ఇంటికి వస్తున్నది. ఇదంతా అవినీతిరహితంగా, జవాబుదారీతనంతో జరిగిపోతున్నది. గతంలో మాదిరిగా ఫోర్జరీ, ట్యాంపరింగ్తో గానీ, తమ పేర ఉన్న వ్యవసాయ భూమి ధరణి పోర్టల్ వల్ల ఇతరుల పేరు మీదకు ఎట్టి పరిస్థితుల్లో మారే అవకాశం లేకపోవడంతో గుండె ధైర్యంతో ఉంటున్నారు.
అనేక ప్రయోజనాలున్న ధరణి పోర్టల్ను తాము అధికారంలోకి రాగానే తీసేస్తామని అంటున్న కాంగ్రెసోళ్ల వ్యాఖ్యలపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దోపిడీ రాజ్యం పోయి అన్నదాతలకు మంచిరోజులు వస్తే జీర్ణించుకోలేక ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ధరణి వచ్చాకే రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగుతున్నాయని, కార్యాలయాల చుట్టూ తిరగడం తప్పిందని చెప్తున్నారు. వారి పాలనలో లంచం లేనిదే ఫైలు కదిలేది కాదని, సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో పైసా ఖర్చు లేకుండా నిమిషాల్లోనే పని జరుగుతున్నదని అంటున్నారు. గతంలో రైతు మరణిస్తే ఆపద్బందు కింద రూ.50 వేలు ఇచ్చేదని, ఆ డబ్బులు కూడా ఎప్పుడు వచ్చేవో కూడా తెలిసేది కాదంటున్నారు. ఇకవేళ వచ్చినా అందులో సంగం మేర లంచాలకే పోయేదని చెప్తున్నారు. అదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో రైతు మరణిస్తే రూ.5లక్షలు బాధిత కుటుంబం అకౌంట్లలోనే నేరుగా పడుతున్నాయని, ధరణి తీసేస్తామని అంటున్న ప్రతిపక్ష నాయకులు తమ పద్ధతిని మార్చుకోవాలని రైతాంగం హెచ్చరిస్తున్నది.
డబ్బులిస్తేనే రికార్డులో భూమి ఉండేది..
పర్వతగిరి : ఒకప్పుడు డబ్బులు ఇస్తేనే భూమి ఉండేది, రికార్డులు మారేవి. గ్రామంలో ఉండే రెవెన్యూ వాళ్లదే రాజ్యం. ఎవరు డబ్బులిస్తే వారికే పట్టాలు వచ్చేవి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల నికార్సైన రైతులకు న్యాయం జరిగింది. ముందుచూపుతో సీఎం కేసీఆర్ ఆలోచించి ధరణితో పాటు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి రైతులకు ఎంతో మేలు చేశారు. ఏడేండ్ల క్రితం మా ఊళ్లో మూడెకరాల వ్యవసాయ భూమి కొన్నం. పట్టా చేసుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డాం. మాలాంటి వారి కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో సీఎం సారు దేవుని లెక్క ధరణి పోర్టల్ పెట్టిండు. తహసీళ్ల నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు అయితానయ్. పైసా ఖర్చు లేకుండా మాకు భూమి పట్టా అయింది. సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– తుంగాని పార్వతమ్మ, రాములు అన్నారం షరీఫ్/ పర్వతగిరి మండలం
జిల్లాలో పూర్తయిన రిజిస్ట్రేషన్ల వివరాలు..
వరంగల్ జిల్లాలోని పదమూడు మండలాల్లో ఇప్పటి వరకు 39,859 మంది రైతులు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. వీరిలో 39,222 మంది రిజిస్ట్రేషన్ విజయవంతంగా జరిగింది. మరో 636 మంది ప్రక్రియ ప్రాసెస్లో ఉంది. 39,222 రిజిస్ట్రేషన్లలో 19,520 సేల్, 7,961 గిఫ్ట్, 2,085 మ్యుటేషన్, 340 పార్టిషన్, 3,101 సక్సెషన్, 3,734 మార్టిగేజ్, 2,466 నాలా, 21 ఇతర రిజిస్ట్రేషన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో జిల్లాలో రాయపర్తి మండలం నంబర్వన్ స్థానంలో ఉంది. ఇక్కడ అత్యధికంగా 6,220 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 4,488 రిజిస్ట్రేషన్లతో గీసుగొండ మండలం ద్వితీయ, 3,744 రిజిస్ట్రేషన్లతో పర్వతగిరి మండ లం మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో మండలం వారీగా వర్దన్నపేటలో 3,731, దుగ్గొండి 3,647, నెక్కొండ 3,326, సంగెం 3,276, నర్సంపేట 2,578, ఖిలావరంగల్ 2,524, చెన్నారావుపేట 2,285 , నల్లబెల్లి 2,213, వరంగల్లో 1,006 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ధరణిని రద్దు చేస్తామనడం కాంగ్రెస్ అవివేకం
ఖానాపురం : ఎన్నో ఏండ్ల భూ సమస్యలకు పరిష్కారం చూపుతున్న ధరణిని తాము
అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్పడం కాంగ్రెస్ నేతల అవివేకానికి నిదర్శనం. గతంలో పట్టా చేయించుకోవాలంటే దళారులను కలవాల్సి వచ్చేది. సామాన్యుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. అలాంటి వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం రూపుమాపేందుకు ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కోసం మీసేవలో స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయానికి తహసీల్దార్ కార్యాలయానికి వస్తే 15 నిమిషాల్లో భూముల పట్టా ప్రక్రియ పూర్తవుతున్నది. మా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 1.30 ఎకరాలు పట్టా చేయించుకున్న. అప్పటికప్పుడే పట్టా పేపర్లు చేతికి ఇచ్చారు. 25 రోజుల్లో పాస్బుక్ ఇంటికి వచ్చింది. పైసా ఖర్చు లేకుండానే పని పూర్తయింది. ఇంత మంచి వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేస్తే అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు రద్దు చేస్తామనడం సరికాదు. వాళ్లు అధికారంలోకి వస్తే పైరవీకారుల రాజ్యం వస్తది. పైసలున్న వాళ్లకే భూములు పట్టాలవుతాయి. ధరణిని ఎత్తివేస్తామని అంటే ఊరుకునేదిలేదు.
– షేక్ మౌలానా, రైతు బుధరావుపేట, ఖానాపురం మండలం
రైతుల పాలిట వరప్రదాయిని..
సంగెం : ధరణి రైతుల పాలిట వరప్రదాయిని. గత ప్రభుత్వాల్లో డబ్బులున్నోళ్లదే భూమి అన్నట్లుగా హక్కు పొంది ఉన్నారు. పైసలిస్తే రికార్డులు తారుమారయ్యేవి. భూములు లేనివారికి కూడా పట్టా పాస్ బుక్కులు ఇచ్చేది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా భూములపై హక్కు పత్రాలు వచ్చాయి. ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం పొందుతున్నారు. కాంగ్రెస్ నాయకులు ధరణితో రాజకీయం చేద్దామని అనుకుంటున్నరు. తాము అధికారంలోకి వస్తే తీసివేస్తామని అనడం సమంజసం కాదు. డబ్బున్నోడిదే భూమి అనేలా చేద్దామని చూస్తున్నరు. దీనిని ఏ రైతూ స్వాగతించడు. అన్నదాతలతో ఆటలాడుకోవద్దు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తమ భూములను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకునే వీలు ఉన్నది. ఈ పథకం జోలికి వస్తే ఊరుకునేదిలేదు.
– ఉండీల రాజు రైతు, నర్సానగర్, సంగెం మండలం
మళ్లీ దళారుల రాజ్యమొస్తది..
గీసుగొండ : ఒకప్పుడు తాతలు, తండ్రుల పేర్ల మీద ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగేది. దళారులను పట్టుకుంటే వెంటనే పని అయ్యేది. తెలంగాణ సర్కారు వచ్చినంక ధరణి తేవడంతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్లు అయితున్నయ్. మా భూములకు రక్షణ వచ్చింది. గతంల పట్టాదారుకు తెల్వకుండానే భూమి మరొకరి పేర్లమీద మార్చుకునేది. ఇప్పుడు భూముల వివరాలు ఫోన్లోనే చూసుకుంటున్నం. ధరణి పోర్టల్ను రద్దు చేస్తే రైతులను కష్టాల్లోకి నెట్టేసినట్టే. మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ధరణి పోర్టల్ రాకముందు రోజూ పోలీస్స్టేషన్లతో పాటు తహసీల్దార్ కార్యాలయాల వద్ద భూ సమస్యలపై గొడవలు జరిగేవి. మళ్లీ ఆ పరిస్థితులు తీసుకురావద్దని కాంగ్రెసోళ్లను కోరుతున్న.
-రడం భరత్, రాంపురం, గీసుగొండ మండలం