కృష్ణకాలనీ, ఫిబ్రవరి 25 : ‘పార్లమెంటులో వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడుతమని చెప్పి అధికారంలోకి వచ్చిన్రు.. ఎనిమిదిన్నరేండ్ల నుంచి మాదిగలను బీజేపీ ప్రభుత్వం దగా చేస్తున్నది.. ఈ విషయం పై స్పష్టత ఇచ్చినంకనే మాట్లాడాలె’ అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను ఎమ్మార్పీఎస్ నాయకులు నిలదీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలో ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ పేరిట శనివారం రాత్రి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఎమ్మె ల్యే ఈటల మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఎమ్మార్పీఎస్ నాయకులు వేదిక వద్దకు జెండాలతో తరలివచ్చి ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే మాట్లాడాలని భీష్మించారు. బీజేపీ సర్కారు దళితులను కనీసం పట్టించుకోకుండా వారిపై దాడులు చేయిస్తున్నదని మండిపడ్డారు. దళితులను అన్ని రంగాల్లో బీజేపీ దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించగా ఈటల ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఓ వైపు తమ డిమాండ్ను వినిపిస్తున్న సమయంలో సహనం కోల్పోయిన బీజేపీ కార్యకర్తలు కోపంతో ఊగిపోతూ ఎమ్మార్పీఎస్ నాయకులపై దాడికి యత్నించారు. అక్కడి నుంచి వారిని తోసుకుంటూ గెంటివేసే ప్రయత్నం చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులపై కమలం కార్యకర్తలు దాడికి యత్నిస్తున్నా ఈటల ఆపే ప్రయత్నం చేయలేదు. దీంతో ఎమ్మార్పీఎస్ నాయకులు ‘దళిత ద్రోహి బీజేపీ.. బీజేపీ డౌన్..డౌన్..’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు.