CJP Protest : గతవారం సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఆందోళనలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పలువురు ఆందోళనకారుల్ని గుర్తించి, వారిని వరుసగా అరెస్టులు చేస్తోంది. అయితే, ఈ చర్యను సీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఆందోళనలో పాల్గొన్నవారిపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, వారిని అరెస్టు చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని సీజేపీ విమర్శిస్తోంది. అరెస్టైన వారిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకోవాలని కోరారు. లేకుంటే మరోసారి సీజేపీ ఆందోళన నిర్వహిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ మేరకు సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. సీజేపీ ఆందోళన అనంతరం ఈ నెల 25న కేంద్ర మంత్రులు జేపీ నద్దా, జితేంద్ర సింగ్తో సీజేపీ నేతలు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులపై ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని, పోలీసులు చర్యలు తీసుకోకూడదని ఈ చర్చల సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రుల సమక్షంలోనే సీజేపీ నేతలు ప్రకటించారు. అనంతరం సీజేపీ తమ ఆందోళన విరమించింది. అయితే, తాజాగా ఢిల్లీ పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. వారిపై ఎప్ఐఆర్లు నమోదు చేస్తూ, అరెస్టు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా అరెస్టులు చేస్తున్నాయి. అయితే, ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని సీజేపీ విమర్శిస్తోంది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ అరెస్టుల్ని ఖండిస్తోంది.
ప్రభుత్వం ఈ అరెస్టుల్ని ఆపకపోతే, మళ్లీ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించింది. తమ వాలంటీర్లను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడింది. సీజేపీ మరో అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కూడా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్, బెంగాల్లలో వందలమంది విద్యార్థులపై ప్రభుత్వం కేసులు పెడుతోందని అశుతోష్ రాంకా అన్నారు. చాలాచోట్ల వేధింపులకు కూడా పాల్పడుతున్నట్లు రాంకా చెప్పారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.