ఖమ్మం : ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మట్టి , ఇసుక మాఫియా లకు ( Sand mafias ) అండగా ఉంటూ ప్రోత్సహం ఇస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajay kumar ) ఆరోపించారు. రఘునాథ పాలెం మండలంలో అనేక మట్టి గుట్టలను అక్రమంగా తవ్వి దోచుకుంటున్నారని విమర్శించారు. గతంలో తప్పుడు ఆరోపణలు చేసిన వారే ఇప్పుడు అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఖమ్మం నియోజకవర్గంలోని ఈర్లపూడి గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఆరోగ్యంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని, తనకు ఏదో జరిగిపోయినట్లుగా అసత్య వార్తలు ప్రచారం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఆరు అడుగుల కటౌట్లా నిటారుగా నిలబడి ఉన్నానని, ఎప్పటికీ ప్రజల పక్షాన నిలిచి పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే చరమగీతం పాడతారని జోస్యం చెప్పారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రజలతో కలిసి నిరంతరం పోరాటం కొనసాగిస్తానని మాజీ మంత్రి పేర్కొన్నారు.