హనుమకొండ, జనవరి 20 ;కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని, ప్రజాభీష్టం మేరకే పాలన ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్తో కలిసి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల ఆక్రమణపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, కుడా, జీడబ్ల్యూఎంసీ, నేషనల్ హైవేస్, ఐటీడీఏ, హౌసింగ్, పోలీస్, ఫారెస్ట్, దేవాదాయ శాఖల పనితీరు, చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వచ్చే ఎండాకాలంలో ఎకడా తాగునీటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏస్థాయిలో ఉన్నా పూర్తిచేసి లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు. మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లు కేటాయించిందని, ఇప్పటికే రూ.75 కోట్లు విడుదల చేశామని, త్వరలో మరో రూ.30కోట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. మేడారంలో అభివృద్ధి పనులు నెలాఖరులోగా పూర్తవుతాయన్నారు.
జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆరు గ్యారెంటీలు, రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తుల్లో 95 శాతం ఆన్లైన్లో అప్లోడ్ చేశామని, గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులపై చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంటల సాగుకు నీరందకపోతే ఇబ్బందులు వస్తాయని, కాబట్టి ఆ శాఖ అధికారులు సాగునీరందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. హాస్పిటళ్లు, పాఠశాలలు, హాస్టళ్లను కలెక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, తాను కూడా ఎకడోచోట ఆకస్మికంగా తనిఖీ చేస్తానని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రభుత్వ భూములను గజం కూడా వదలబోమని, అక్రమించినవారు ఎంతటివారైనా సరే వారి నుంచి వెనక్కి తీసుకుంటామని చెప్పారు.
అధికారులు సహకరిస్తేనే అభివృద్ధి : మంత్రి సురేఖ
ప్రజలకు సౌకర్యాలు అందాలంటే ఇలాంటి సమీక్ష సమావేశాలు జరగాలని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అధికారులు సహకరిస్తేనే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులు అంకిత భావంతో పనిచేశారని, అదేవిధంగా సహకారం అందించాలన్నారు. నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం ఇంకా భూసేకరణ పూర్తి కావాల్సి ఉందన్నారు.
భూముల పరిశీలనకు రావాలని మంత్రి పొంగులేటిని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫ్రూట్ మారెట్తో పాటు వరంగల్లో కూరగాయల మారెట్ అంశాన్ని ప్రస్తావించారు. నాలాల ఆక్రమణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. హరితహారంలో పండ్ల మొకలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్ జాటోట్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి, డాక్టర్ మురళీ నాయక్, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, సీపీ అంబర్ కిశోర్ ఝా, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, శివలింగయ్య, ఇలా త్రిపాఠి, భవేశ్మిశ్రా, అద్వైత్ కుమార్ సింగ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, ఎస్పీలు శబరీష్, డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, కిరణ్ఖరే, అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ట్రైనీ ఐపీఎస్ శుభం నాగరాలెతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కళాక్షేత్రం పనులు పూర్తిచేయాలి
కాళోజీ కళాక్షేత్రం పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కళాక్షేత్రాన్ని మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలతో కలిసి శనివారం సాయంత్రం పరిశీలించారు. ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియంను పరిశీలించి సూచనలు చేశారు. పనుల గురించి కుడా, ఇతర అధికారులు వివరించారు. కళాక్షేత్రం మ్యాప్ను మంత్రులు పరిశీలించారు.
త్వరలోనే ఫ్లాట్ల వేలం
కరీమాబాద్ : వరంగల్లోని రాంకీ బిల్డర్స్ హౌసింగ్ బోర్డుకు కేటాయించిన సింగిల్ బెడ్రూమ్ గల 102 ఫ్ల్లాట్లను త్వరలో ఓపెన్ వేలం వేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. మంత్రి సురేఖతో కలిసి శనివారం రాత్రి ఆయన పాట్లను పరిశీలించారు. వేలంలో ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి సీతక్క
బడ్జెట్లో నిధుల కేటాయింపు కోసమే ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి (అనసూయ) సీతక అన్నారు. నియోజకవర్గాల వారీగా సమస్యలు తెలుసుకున్నామని, త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మేడారం జాతరకు మరిన్ని బస్సులు కేటాయించాలని మంత్రి పొన్నంను కోరారు. జాతరకు ఏర్పాట్ల పరిశీలనకు రావాలని సహచర మంత్రులను ఆహ్వానించారు. రామప్ప లక్నవరం సరస్సుల అనుసంధానానికి కాలువల నిర్మాణం కోసం భూసేకరణ జరిగిందని, పెండింగ్లో ఉన్న ల్యాండ్ అక్విడేషన్ కోసం డబ్బులు అందించాలన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ పరిధిలో ఉన్న మూడు మండలాలు హనుమకొండ జిల్లా పరిధిలోకి వచ్చాయని, వాటి అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.