నడికూడ, జూన్ 14: రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వసతులు ఉన్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనలతో వైద్య రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సర్కారు దవాఖానలకు ప్రజలు వెళ్లాలంటే బయపడే వారన్నారు. నేడు ప్రభుత్వం గ్రామాల్లో సైతం పల్లె దవాఖాన, పట్టణాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి వైద్యులను నియమిస్తున్నదన్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుండడంతో నేడు ప్రజలు సర్కారు దవాఖానలకు క్యూ కడుతున్నారని వెల్లడించారు.
ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగి, సాధారణ ప్రసవాల కోసం గర్భిణులు వెళ్తున్నారని వివరించారు. కంటివెలుగు కార్యక్రమంతో లక్షల మందికి నేత్ర పరీక్షలు చేసి వేలాది మందికి కంటి అద్దాలను ఉచితంగా ప్రభుత్వం అందించిందన్నారు. రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి కంటే ప్రమాదకరమైన వైరస్ ముట్టడించొచ్చని నిపుణులు హెచ్చరిస్తుండడంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్య వ్యవస్థను పటిష్టం చేస్తున్నారని వివరించారు. పరకాలలో వంద పడకల దవాఖాన త్వరలోనే పూర్తి కానుందన్నారు. హనుమకొండ జిల్లాలో రెండో డయాలసిస్ కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన సంపూర్ణ ప్రగతిని తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే, న్యూట్రీషన్ కిట్లను గర్భిణులకు పంపిణీ చేశారు.
వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ సేవలు అందించిన వారికి ఎమ్మె ల్యే అవార్డులు ప్రదానం చేశారు. అంతేకాకుండా పరకాలలోని దళితకాలనీలో ఎమ్మెల్యే బస్తీ దవాఖానను ప్రారంభించారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, అడిషనల్ డీహెచ్ఎంవో మదన్మోహన్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, పరకాల ఏసీపీ జూపల్లి శివరామయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, పరకాల, ఆత్మకూరు, నడికూడ, దామెర మండలాల జడ్పీటీసీలు పోలీసు ధర్మరాజు, కోడెపాక సుమలత, కక్కెర్ల రాధిక, ఎంపీపీ మచ్చ అనసూర్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.