గీసుగొండ, జూన్ 18 : రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సోమ కుమారస్వామి(58) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీఆర్బీ (డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డు బ్యూరో)లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకుని భద్రాద్రి కొత్తగూడెం నుంచి కారులో వరంగల్లోని కాశీబుగ్గకు వస్తుండగా గీసుగొండ మండలం వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారి హర్జ్యాతండా వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడికి స్థానికులు సీపీఆర్ చేసి వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, ఘటనా స్థలాన్ని సీఐ సట్ల రాజు, ఎస్సై శ్వేత సందర్శించారు. మృతుడికి భార్య మణెమ్మ, కూతుళ్లు సియోష, సుచరిత ఉన్నారు.
కారును లారీ ఢీకొట్టిన ఘటనలో మరొకరు..
కాటారం : మండలంలోని నస్తూర్పల్లి గ్రామ సమీపంలో కాటారం – మహదేవపూర్ ప్రధాన రహదారిపై ఆదివారం కారును లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మహదేవపూర్కు చెందిన మహ్మద్ సాబీర్(40), జమీర్ ఖాన్ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆదివారం కారులో మహదేవపూర్ నుంచి కాటారానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కాటారం నుంచి మహదేవపూర్ వెళ్తున్న లారీ ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారు ముందు భాగంలో చిక్కుకున్న సాబీర్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో వెనుక కూర్చున్న జమీర్కు తీవ్ర గాయాలవడంతో చికిత్స కోసం వరంగల్లోని దవాఖానకు తరలించారు. కాగా, లారీ కారును ఢీకొట్టి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.