ములుగు, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడింది. రోజువారీగా సుమారు 500 నుంచి 600 మంది రోగులు వివిధ ఆరోగ్య సమస్యల నిమిత్తం వస్తుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కారణంగా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ములుగు దవాఖానను డీఎంఈ పరిధిలోకి తెచ్చారు. దీంతో ఇంత కాలం పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. కొత్తగా నియమితులైన స్టాఫ్ నర్సులు ములుగు దవాఖాన ఇటు డీఎంఈ, అటు డీహెచ్ పరిధిలో లేనందున తమ ఆప్షన్లను భూపాలపల్లి జిల్లాకు ఎంచుకొని విధుల్లో చేరారు. జీవో నంబర్ 317ప్రకారం 11మంది స్టాఫ్ నర్సులు వారి జోన్ పరిధిలోని దవాఖానాలకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం 10 మంది స్టాఫ్నర్సులు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లో పనిచేసే సిబ్బంది, వార్డు బాయ్లు, పారామెడికల్ సిబ్బంది కూడా బదిలీపై వెళ్లారు. శానిటేషన్ సిబ్బందితో పాటు 4వ తరగతి సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. 75 పడకల స్థాయి ఉన్న దవాఖానలో ప్రస్తుతం 150 పడకలకు సరిపడా సేవలు అందిస్తున్నారు. వార్డుల సంఖ్య పెరుగడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. ఐసీయూతో పాటు ఎన్ఐసీయూ ఏర్పాటు చేసి సిబ్బంది నియమించకపోవడంతో రోగులు అరకొర సేవలతో వైద్యం పొందుతున్నారు. టీ-హబ్, రేడియాలజీ హబ్ల్లో కూడా సిబ్బంది కొరత కారణంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ములుగు జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ దవాఖానలో ప్రతి రోజు ఓపీ సేవలతో పాటు ఇన్ పేషంట్లుగా 75 నుంచి 100మంది అడ్మిట్ అవుతున్నారు. వీరందరికీ సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది తీ వ్ర పనిభారంతో సతమతమవుతున్నారు. వివిధ విభాగాల్లో వైద్యసేవలు అందించేందుకు 25నుంచి 30మంది వైద్యులు అవసరం ఉండగా ప్రస్తుతం 12 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 100 నుంచి 120మంది వైద్య సిబ్బంది అవసరం ఉండగా సగం మందితోనే కొంతకాలంగా నెట్టుకొస్తున్నారు. వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బంది కొరతతో వైద్యసేవలకు అరకొరగా అందుతున్నాయి. అలాగే అన్ని జిల్లా దవాఖానలకంటే ములుగు జిల్లాలో డెలివరీల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ప్రతి నెల 160 నుంచి 180 వరకు డెలవరీలు జరుగుతుండగా ప్రతి బుధ, శుక్ర వారాల్లో సాధారణ ఓపీ సేవలతో పాటు గర్భిణులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడంలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు దవాకాన నుంచి భూపాలపల్లి జిల్లాకు వెళ్లిపోయిన స్టాఫ్ నర్సులను ములుగుకు తిరిగి రప్పించాలని, పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని కోరుతూ ఇటీవల మంత్రి సీతక్కకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. స్పందించి మంత్రి వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శికి విషయాన్ని తెలియజేశారు. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.