అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలే రోజు రానే వచ్చింది. పోలింగ్ ముగిసిన క్షణం నుంచి ఏయే నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఎవరికి వారు తమదే విజయమని, మెజార్టీయే లక్ష్యమంటూ ధీమా వ్యక్తంచేస్తున్నప్పటికీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారోననే ఆందళోన వెంటాతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా ఆదివారం ఐదు చోట్ల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా శనివారం ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చి, కేటాయించిన రౌండ్ల ప్రకారం టేబుల్ సిద్ధం చేసింది. మూడంచెల భద్రత నడుమ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్లు లెక్కించనుండగా ప్రక్రియ ముగిసే వరకూ 144 సెక్షన్ అమలుచేస్తుంది. ఫలితాలు వెల్లడయ్యాక ఆయా పార్టీలు విజయోత్సవ ర్యాలీలు, డీజేలు, పటాకులు కాల్చవద్దంటూ నిషేధాజ్ఞలు విధించింది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. స్ట్రాంగ్ రూం నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని పోలీసు బందోబస్తు మధ్య సిబ్బంది కౌంటింగ్ రూంకు తీసుకెళ్తారు. ముందుగా పోస్టల్బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. భూపాలపల్లి సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోని సింగరేణి మినీ ఫంక్షన్హాల్లో నిర్వహించనున్నారు. అలాగే ములుగుకు సంబంధించి ములుగు కలెక్టరేట్లో, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలవి మహబూబాబాద్లోని సాంఘిక సంక్షేమ గురుకులంలో, జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్కు సంబంధించి పెంబర్తిలోని వీబీఐటీ కళాశాలలో, వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్నారు.
కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతా సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. 14 టేబుళ్లలో కౌంటింగ్ సిబ్బంది ఓట్లను లెక్కిస్తుండగా అక్కడే ఉన్న కంట్రోల్ రూంలో ఎప్పటికప్పుడు సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తారు. కౌంటింగ్ హాల్కు ఒక పక్క మీడియా సెంటర్ను, మరో పక్క ఆయా పార్టీల ప్రతినిధులకు, ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక హాళ్లను కేటాయించారు. లెక్కింపు ఏర్పాట్లను శనివారం జిల్లా ఎన్నికల అధికారులు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, భవేశ్మిశ్రా, ఇలా త్రిపాఠి, శివలింగయ్య, శశాంక పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచనలు చేశారు.
కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేడు అంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎలాంటి గొడవలకు తావులేకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకోనున్నది. ఎలాంటి ర్యాలీలు, డీజేలు, పటాకులు కాల్చడంపై నిషేధం విధించారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని చెప్పారు. కౌంటింగ్ పూర్తయిన 24గంటల తర్వాత అనుమతి తీసుకుని సంబురాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. పోలీసుల విజ్ఞప్తిని ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.