నర్సంపేట రూరల్, జనవరి 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జీవరత్నం కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులతో కంటివెలుగుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జీవరత్నం, ఎంపీపీ మోతె కళావతి మాట్లాడుతూ ఈ నెల 18న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.
ఇందులో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ముందుగా మండలకేంద్రాల్లో కంటి వెలుగు శిబిరాలను ప్రారంభిస్తామని, ఆ తర్వాత అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమాన్ని వందశాతం విజయవంతం చేయాలని కోరారు. సమీక్షలో ఎంపీడీవో ఇంద్రసేనారెడ్డి, ఎంపీవో సునీల్కుమార్రాజ్, భాంజీపేట వైద్యాధికారి బానాల అరుణ్చంద్ర పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
వర్ధన్నపేట: ఈ నెల 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గొడిశాల రవీందర్ అధ్యక్షతన కంటి వెలుగుపై సమీక్షించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ కౌన్సిలర్లు, యువకులు ప్రజలకు అవగాహన కల్పించి శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. కంటిలో లోపం ఉంటే ఉచితంగా అద్దాలు ఇవ్వడంతోపాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయిస్తారన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.