నెల్లికుదురు/హనుమకొండ సిటీ/భూపాలపల్లి రూరల్/జనగా మ చౌరస్తా, జనవరి 19 : పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)లను ఈ నెల 29న ఎన్నుకోనున్నారు. ఈమేరకు విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారికంగా ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేసి, 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. 2019లో పాఠశాల యాజమాన్య కమిటీలను ఎన్నుకున్నారు. వాటి గడువు 2021తో ముగియగా తిరిగి ఆరు నెలలపాటు పొడిగించారు. అది కూడా పూర్తవడంతో 6 నెలల చొప్పున పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాత కమిటీలే కొనసాగుతున్నాయి. కాగా, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కాగా, ఈ ఎన్నికకు సంబంధించి పాఠశాల హెచ్ఎంలు ఈ నెల 20న ఉదయం 10గంటలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
అదేరోజు మధ్యాహ్నం 2గంటలకు నోటీ సు బోర్డులో విద్యార్థుల తల్లిదండ్రుల(ఓటర్లు) జాబితాను ప్రదర్శిస్తారు. 22, 23 తేదీల్లో సాయంత్రం 4గంటల వరకు జాబితా పై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 24న ఎస్ఎంసీ సభ్యుల ఎన్నిక కోసం తుది జాబితాను విడుదల చేస్తారు. చేతులెత్తే పద్ధతి ద్వారా గానీ, తప్పని పరిస్థితుల్లో రహస్య బ్యాలెట్ విధానం ద్వారా గానీ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వర కు ఎన్నికలు నిర్వహిస్తారు. అదేరోజు 1.30 గంటల తర్వాత ఎన్నికైన సభ్యుల నుంచి చైర్మన్, వైస్చెర్మన్ను ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎస్ఎంసీ ప్రథమ సమావేశం నిర్వహిస్తారు.