హనుమకొండ చౌరస్తా, జనవరి 11 : ఆర్టీసీకి సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. బస్సుల రాకపోకలు, ప్రయాణికులతో హనుమకొండ బస్స్టేషన్ హడావుడిగా కనిపించింది. హైదరాబాద్, కరీంనగర్, ఏటూరునాగారం, ములుగు, భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి, నిజామాబాద్, ఖమ్మం, నర్సంపేట రూట్లలో రద్దీ ఎక్కువగా ఉన్నందున ఆయా రూట్లలో బస్సుల సంఖ్య పెంచారు. వరంగల్ బస్స్టేషన్, ములుగురోడ్డు, వరంగల్ అండర్బ్రిడ్జి, పబ్లిక్గార్డెన్ ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రజలు సొంత గ్రామాలకు తరలివెళ్లారు. వరంగల్-1, 2, హనుమకొండ, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, పరకాల, భూపాలపల్లి, జనగామ డిపోల వారీగా బస్సులను నడిపిస్తున్నారు. ఈ నెల 12 నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు లగేజీలతో బస్స్టేషన్ల బాట బట్టారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అదనపు సర్వీసులను నడిపిస్తున్నారు. సుమారు 300 వరకు అదనంగా బస్సులను తిప్పుతున్నారు. గత సంవత్సరం కంటే బస్సుల సంఖ్యను పెంచారు. రద్దీగా ఉన్న రూట్లలో అదనపు సర్వీసులను తిప్పుతున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్ పరిధిలో 300 అదనపు బస్సు సర్వీసులను నడిపిస్తున్నాం. ప్రతి రోజూ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు ట్రి ప్పులు తిప్పిస్తున్నాం. హైదరాబాద్ రూట్ లో రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రతి రోజూ 150అదనపు ట్రిప్పులు తిరుగుతున్నాయి.