న్యూఢిల్లీ, ఆగస్టు 14 : దేశ ప్రజలు తమ రాజకీయ నేతను ఎన్నుకునే విధానంలో శాంతియుత విప్లవానికి దిగాలని, 2047 నాటికి భారత్ ఒక గౌరవప్రదమైన దేశంగా నిలవాలంటే భారీ మార్పులు అవసరమని ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయనొక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సహాయపడగల నిస్వార్థపరులు, నిర్భయులు, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన స్త్రీ, పురుషుల పేర్లను సూచించాలని అన్నారు. మన దేశ ప్రగతిని పొరుగు దేశాలతో పోల్చి, దేశ ఆర్థిక స్థితిపై ఆందోళన చెందినట్టు వాంగ్చుక్ పేర్కొన్నారు. 50 ఏండ్ల క్రితం ఎంతో వెనుకబడిన లేదా సమానంగా ఉన్న పొరుగుదేశాలు ఇప్పుడు భారత్ను దాటి ఎన్నో మైళ్లు ముందుకు వెళ్లిపోయాయని శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్లాండ్, మలేషియా, ఇండోనేషియాలను ఉద్దేశించి పేర్కొన్నారు.